కలం, వెబ్ డెస్క్: శ్రీలంక తీరంలో ఇరాన్ యుద్ధ నౌకను (Iranian Warship) అమెరికా ముంచేయడంపై లోక్సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) స్పందించారు. ఈ ఘటనపై ప్రధాన మంత్రి మోదీ మౌనంగా ఉండడాన్ని తప్పుపట్టారు. ఈ మేరకు గురువారం తన ‘ఎక్స్’ ఖాతాలో ఓ ట్వీట్ పోస్ట్ చేశారు.
‘దేశానికి చమురు సరఫరా ప్రమాదంలో పడింది. మన ఇంధన దిగుమతుల్లో 40శాతం కంటే ఎక్కువ హర్మూజ్ జలసంధి నుంచే వస్తాయి. ఎల్పీజీ, ఎల్ఎన్జీ విషయంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఈ సంఘర్షణ మన ఇంటి వెనుక భాగానికి చేరుకుంది. హిందూ మహాసముద్రంలో ఇరాన్ యుద్ధనౌకను ముంచేశారు. అయితే, దీనిపై ప్రధాని ఏమీ మాట్లాడలేదు. ఇలాంటి సమయాల్లో దేశాన్ని నడిపించడానికి స్థిరమైన నాయకత్వం అవసరం. కానీ, మన దేశానికి ఒక రాజీపడిన ప్రధాని (కాంప్రమైజ్డ్ పీఎం) ఉన్నారు. ఆయన మన వ్యూహాత్మక స్వాతంత్య్రాన్ని బలిచేశారు’ అని ట్విట్టర్లో రాహుల్(Rahul Gandhi) పేర్కొన్నారు.
ఇరాన్ యుద్ధ నౌక ఐరిస్ దేనాను ముంచేయడంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సైతం ప్రధాని తీరును విమర్శించారు. మన దేశ వ్యూహాత్మక, జాతీయ ప్రయోజనాలను మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం అందరికీ స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ‘మన దేశం ఆతిథ్యం ఇచ్చిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ–2026లో పాల్గొన్న ఇరాన్ యుద్ధ నౌక మన అతిథి. విశాఖపట్నం నుంచి నిరాయుధంగా స్వదేశానికి తిరిగి వెళుతున్న ఈ నౌక టోర్పెడో దాడికి గురై మునిగిపోయింది. దీనిపై ఆందోళన లేదా సానుభూతి తెలిపే ఏ ఒక్క ప్రకటన ప్రధాని నుంచి లేదు. పీఎం మోదీ మౌనంగా ఉన్నారు’ అని ఖర్గే తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు.
Read Also: తెలంగాణ IPS కు అమిత్ షా బంపర్ ఆఫర్
Follow Us On: Instagram

