కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ కలెక్టర్ (Nizamabad Collector) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏకలవ్య మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సహా నలుగురిని సస్పెండ్ చేశారు. ఇందల్వాయి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో రామ్ చరణ్ (15) అనే తొమ్మిదవ తరగతి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై విచారణ జరిపిన కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. ప్రాంతీయ సమన్వయకర్త గంగారాం నాయక్ నేతృత్వంలో ఇతర జిల్లాల నుండి వచ్చిన ఏకలవ్య మోడల్ స్కూళ్ల ప్రిన్సిపాల్స్ శ్రీనివాస్ స్వామి, డాక్టర్ సైదా జైనబ్, ఫణి కుమార్, డాక్టర్ జ్యోతి ఆధ్వర్యంలోని కమిటీ ప్రాథమికంగా విచారణ జరిపి కలెక్టర్కు నివేదిక సమర్పించారు. వీరి నివేదిక ఆధారంగా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపాల్ రమేశ్కుమార్ను, హౌస్మాస్టర్ కుల్దీప్ యాదవ్ను, హాస్టల్ వార్డెన్ విశ్వంబర్, మెస్ ఇంచార్జి ఆకాష్ యాదవ్ లను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
కలెక్టర్ ఇలా త్రిపాఠి (Nizamabad Collector Ila Tripathi) బుధవారం ఇందల్వాయి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ను సందర్శించారు. అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులతో భేటీ అయి, రామ్ చరణ్ ఆత్మహత్య సంఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. రామ్ చరణ్ బలవన్మరణానికి పాల్పడడం ఎంతో బాధ కలిగించిందని కలెక్టర్ ఆవేదన వెలిబుచ్చారు.
జీవితంలో అనేక సమస్యలు వస్తుంటాయని, వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని విద్యార్థులకు ఉద్బోధించారు. ఆత్మహత్య ఆలోచనలు దరి చేరకుండా, ఏకాగ్రతతో చదువుపై దృష్టి కేంద్రీకరించాలని హితవు పలికారు. క్రమశిక్షణతో ముందుకెళ్తే మంచి భవిష్యత్తు సొంతం అవుతుందని అన్నారు. తప్పుడు నిర్ణయాలతో నిండు జీవితాన్ని బలవంతంగా అంతం చేసుకోవద్దని, తల్లిదండ్రులకు కడుపు కోత మిగల్చవద్దని అన్నారు. కలెక్టర్ వెంట ఆర్.సీ.ఓ గంగారాం నాయక్ తదితరులు ఉన్నారు.
Read Also: లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత గణపతి..?
Follow Us On : WhatsApp

