కలం, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా సింగనమల (Singanamala)లో టీడీపీలో వర్గ విబేధాలు బయటపడ్డాయి. సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి (Bandaru Sravani), టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆలం నరసానాయుడు (Alam Narasanaidu) మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గమనేలా ఉందని స్థానికంగా చర్చ నడుస్తోంది. తాజాగా వీరి అనుచరుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సింగనమల మండలంలోని నాగులగుడ్డం తండాలో సీసీ రోడ్ల పనులు చేపట్టే విషయంలో వివాదం తలెత్తింది. ఎమ్మెల్యే మనుషులు పనులు చేపట్టడంతో ఆలం వర్గీయులు పనులను అడ్డుకున్నారు. దీంతో వివాదం ముదిరి దాడులు చేసుకున్నారు. ఒకరిపై ఒకరు కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

