కలం, వెబ్ డెస్క్: ఆదిపరాశక్తి (Adi Parashakti) ఆరాధనలో పసుపు కొమ్ముల మాల సమర్పించడం ఒక విశిష్టమైన ఆచారం. కేవలం భక్తితోనే కాకుండా, దీని వెనుక లోతైన ఆధ్యాత్మిక, శాస్త్రీయ కారణాలు ఉన్నాయని దేవీ భాగవతం వంటి గ్రంథాలు చెబుతున్నాయి. ప్రస్తుతం శ్రావణ, మార్గశిర మాసాల్లో మరియు శుక్రవారాల్లో భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారికి ఈ మాలలను సమర్పిస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు.
దేవీ భాగవతం ప్రకారం, శుంభ నిశుంభుల సైన్యాధిపతి రక్తబీజుడితో యుద్ధం చేసిన సమయంలో అమ్మవారు తీవ్ర ఉగ్రతకు లోనయ్యారు. యుద్ధం వల్ల కలిగిన తాపాన్ని, గాయాలను తగ్గించుకోవడానికి ప్రకృతి ప్రసాదమైన పసుపును ఆమె ఆశ్రయించినట్లు పురాణాలు వివరిస్తున్నాయి. పసుపులోని క్రిమిసంహారక గుణం వల్ల అమ్మవారి ఉగ్రరూపం తగ్గి, ఆమె ప్రశాంత స్వరూపిణిగా మారిందని భక్తుల నమ్మకం.
పసుపు (Turmeric) కొమ్ముల మాల వేయడం వెనుక ఒక అద్భుతమైన జీవన సత్యం దాగి ఉందని పెద్దలు చెప్తున్నారు. పసుపు కొమ్మును భూమిలో పాతితే మళ్లీ మొలకెత్తుతుంది, కానీ దానిని ఉడికించి ఎండబెడితే అది పునరుత్పత్తి సామర్థ్యాన్ని కోల్పోతుంది. అలాగే మనలోని కోరికలను, అరిషడ్వర్గాలను దహించి వేసి, పునర్జన్మ లేని జన్మరాహిత్యాన్ని ప్రసాదించమని అమ్మవారిని వేడుకోవడమే ఈ మాల వెనుక ఉన్న అసలు రహస్యమని పండితులు చెప్తున్నారు.
శాస్త్రం ప్రకారం 108 పసుపు కొమ్ములతో మాల కట్టడం అత్యంత శ్రేష్ఠం. వీలుకాని పక్షంలో 54, 21 లేదా 11 కొమ్ములతో కూడా మాల తయారు చేయవచ్చు. ఈ మాలను కేవలం పసుపు రంగు దారంతోనే కట్టాలని, ఆ సమయంలో లలితా సహస్రనామ పారాయణం చేయడం వల్ల రెట్టింపు ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు.
వివాహం ఆలస్యమవుతున్న వారు ఈ మాలను సమర్పిస్తే త్వరగా కళ్యాణ ఘడియలు వస్తాయి. నరఘోష, దృష్టి దోషాలతో ఇబ్బంది పడేవారికి ఇది అద్భుతమైన పరిహారం. ముత్తైదువులు తమ భర్త క్షేమం కోసం, కుటుంబ సౌభాగ్యం కోసం ఈ పూజ చేస్తారు. అమ్మవారు ప్రకృతి స్వరూపిణి కావడంతో, భూమి తన సారాన్నంతా దాచుకున్న పసుపు కొమ్ములను ఆమెకు సమర్పించడం ద్వారా ఐశ్వర్యం, ఆరోగ్యం సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

