కలం, వెబ్ డెస్క్ : సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ట్రోలింగ్పై న్యాయవాది రేణుక జెట్టి (Renuka Jetti) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ఒక వీడియోను విడుదల చేసిన ఆమె, తనకు అండగా నిలిచిన తెలుగుదేశం పార్టీ కుటుంబానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గతంలో అబద్ధాలను నిజాలుగా నమ్మించి, వన్ ఛాన్స్ అంటూ అధికారాన్ని చేజిక్కించుకోవడానికి వైసీపీ ఎలాంటి ఫేక్ స్ట్రాటజీలను వాడిందో, ఇప్పుడు అదే తరహా కుట్రలు చేస్తోందని ఆమె మండిపడ్డారు. ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి ఇద్దరు కుమార్తెలు ఉన్నప్పటికీ, మహిళలను కించపరిచేలా వ్యవహరించడం శోచనీయమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనపై వస్తున్న ట్రోల్స్ అన్నీ వైసీపీ హెడ్ ఆఫీస్ నుంచే పక్కా ప్రణాళికతో ఆర్గనైజ్ చేయబడుతున్నాయని ఆమె ఆరోపించారు. సమస్యను నేరుగా ఎదుర్కోవడం చేతకాక ఆడవాళ్లను అడ్డం పెట్టుకుని శిఖండిలా ప్రవర్తిస్తున్న వారికి చీర, సారె పంపిస్తానంటూ ఎద్దేవ చేశారు.
తన వ్యక్తిగత విషయాలపై వస్తున్న ఆరోపణలను రేణుక జెట్టి ఈ సందర్భంగా తీవ్రంగా ఖండించారు. తాను జూన్ నెలలో కారు కొంటే, దానిని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఇచ్చారని, ఆయన వద్ద తాను లంచం తీసుకున్నానని నీచమైన ప్రచారం చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు మళ్ళీ అదే కారును బీఆర్ నాయుడు ఇచ్చారని కొత్త కథలు అల్లుతున్నారని, ఒకవేళ ఆయనే ఇస్తే తాను ప్రతి నెలా ఈఎంఐ ఎందుకు కడతానని ఆమె ప్రశ్నించారు. బీఆర్ నాయుడు దగ్గర తాను ఐదు కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్లు చేస్తున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేశారు. రాజకీయంగా బీఆర్ నాయుడు గారిని ఎదుర్కోలేకనే వైసీపీ నేతలు ఇంత నీచానికి దిగజారుతున్నారని ఆమె ఎద్దేవా చేశారు.
ముఖ్యంగా వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు, గుర్రం వంటి వారు తనపై ఫేక్ పోస్టులు పెట్టిస్తున్నరని రేణుక (Renuka Jetti) ఆరోపించారు. రాజకీయాలను రాజకీయంగా చేయాలని, ఎవరెవరికో సంబంధాలు అంటగట్టి వారి కుటుంబాలను నాశనం చేయవద్దని ఆమె హితవు పలికారు. ఈ రోజు వైసీపీ నేతలు చేస్తున్న పాపాలను రేపు వారి బిడ్డలే అనుభవించాల్సి వస్తుందని హెచ్చరించారు. సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులు పెడుతున్న కార్యకర్తలు రేపటి రోజున ఇబ్బందులు పడతారని, పోస్టులు చేయించిన నాయకులు పక్కకు తప్పుకుంటారని, కానీ కేసులు ఎదుర్కొని జీవితాలు నాశనం చేసుకునేది మాత్రం పోస్టులు చేసిన వారేనని ఆమె హెచ్చరించారు. ఎంతటి ఇబ్బందులు ఎదురైనా తన వ్యక్తిత్వాన్ని చంపుకొని బతకనని ఆమె పేర్కొన్నారు.

