కలం, వెబ్ డెస్క్: టీ20 ప్రపంచకప్ 2026 సెమీఫైనల్కు భారత్ దూసుకెళ్లిన వేళ, టీమ్ మేనేజ్మెంట్కు మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ (Sanjay Manjrekar) ఒక కీలక రిక్వెస్ట్ చేశారు. గతంలో చేసిన పాత తప్పులను రిపీట్ చేయవద్దని, ముఖ్యంగా సంజూ శాంసన్ బ్యాటింగ్ ఆర్డర్తో ప్రయోగాలు చేయవద్దని హెచ్చరించారు. గత ఐదు టీ20 మ్యాచ్ల్లో మూడు సెంచరీలు బాదిన సంజూ శాంసన్ అద్భుతమైన ఫామ్లో ఉన్నారని మంజ్రేకర్ గుర్తు చేశారు. 2025 ఆసియాకప్ సమయంలో శుభ్మన్ గిల్ను ఓపెనర్గా పంపేందుకు సంజూను బ్యాటింగ్ ఆర్డర్లో కిందికి నెట్టడం పెద్ద తప్పిదమని అభిప్రాయపడ్డారు. దీనివల్ల సంజూ తన సహజ సిద్ధమైన ఫామ్ కోల్పోయారని, అటువంటి నిర్ణయాలు మళ్ళీ తీసుకోకూడదని తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో పేర్కొన్నారు.
మిగతా యువ బ్యాటర్ల కంటే సంజూ ఆట తీరు భిన్నంగా ఉంటుందని మంజ్రేకర్ (Sanjay Manjrekar) విశ్లేషించారు. అభిషేక్ శర్మ లేదా తిలక్ వర్మ వంటి వారు ఫోర్స్డ్గా భారీ షాట్లు ఆడేందుకు ప్రయత్నిస్తారని, కానీ సంజూకి మంచి బంతులను సైతం అలవోకగా సిక్సర్లుగా మార్చే అద్భుతమైన ప్రతిభ ఉందని కొనియాడారు. వెస్టిండీస్పై 97 పరుగులతో అజేయంగా నిలిచి భారత్ను గెలిపించిన తీరు ఆయన సామర్థ్యానికి నిదర్శనమని చెప్పారు. వెస్టిండీస్ నిర్దేశించిన 196 పరుగుల భారీ లక్ష్యాన్ని చూసి తాను మొదట ఆందోళన చెందానని మంజ్రేకర్ అంగీకరించారు. భారత బ్యాటింగ్ అప్పట్లో అంత మెరుగ్గా లేదని, కానీ సంజూ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్తో భారత్ చారిత్రాత్మక విజయాన్ని అందుకుందని ప్రశంసించారు. మార్చి 5న ముంబైలో ఇంగ్లాండ్తో జరగనున్న సెమీఫైనల్లో భారత్ పాత తప్పులు చేయకుండా రాణించాలని ఆకాంక్షించారు.

