కలం, వెబ్ డెస్క్: “విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి దిగ్గజాలను డగౌట్ నుండి గమనిస్తూ నేను ఎంతో నేర్చుకున్నాను” అంటూ టీమిండియా స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ (Sanju Samson) తన మనసులోని మాటను పంచుకున్నారు. టీ20 ప్రపంచకప్ 2026 (T20 World Cup) సూపర్-8లో భాగంగా ఆదివారం ఈడెన్ గార్డెన్స్లో వెస్టిండీస్తో జరిగిన కీలక పోరులో శాంసన్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. అతడి ఆటతో భారత్ సెమీఫైనల్కు దూసుకెళ్లింది. వెస్టిండీస్ నిర్దేశించిన 196 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సంజూ ఆకాశమే హద్దుగా చెలరేగారు. కేవలం 50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 97 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. మరో 4 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్ల తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది. టీ20 వరల్డ్ కప్ ఛేజింగ్లో ఒక భారతీయుడు సాధించిన అత్యధిక స్కోరుగా సంజూ ఇన్నింగ్స్ సరికొత్త రికార్డు సృష్టించింది.
సంజూ ఎమోషన్
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచిన సంజూ (Sanju Samson), మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. దిగ్గజ ఆటగాళ్లు మ్యాచ్లను ఎలా ముగిస్తారో, పరిస్థితులకు తగ్గట్టుగా ఆటను ఎలా మారుస్తారో గమనించడం తనకు ఎంతో సహాయపడిందని తెలిపారు. కెరీర్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ, దేవుడిపై నమ్మకంతో శ్రమించానని, ఈ రోజు కోసం తాను ఎంతో కాలంగా వేచి చూస్తున్నానని ఎమోషనల్ అయ్యారు. సంజూ అద్భుత ప్రదర్శనపై ఆయన భార్య చారులత రమేష్ సోషల్ మీడియాలో స్పందించారు. కొన్ని క్షణాలను మాటల్లో వివరించలేమని, వాటిని కేవలం అనుభవించాలని ఆమె పేర్కొన్నారు. సంజూ తన భర్త అయినందుకు గర్వంగా ఉందని, దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చారు. ప్రస్తుతం సంజూ శామ్సన్ ఇన్నింగ్స్పై క్రీడా లోకం ప్రశంసల వర్షం కురిపిస్తోంది.
Read Also: సెమీస్కు టీమిండియా.. వెస్టిండీస్పై ఘన విజయం
Follow Us On : WhatsApp

