కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి రేపుతున్న ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ చేయనున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari)పై దాఖలైన అనర్హత పిటిషన్పై నేడు ఉదయం 11 గంటలకు విచారణ ప్రారంభం కానుంది. కడియం శ్రీహరి పార్టీ మారడాన్ని సవాలు చేస్తూ ఎమ్మెల్యే వివేకానంద ఈ పిటిషన్ను దాఖలు చేశారు. నేటి విచారణలో భాగంగా వివేకానంద తరపు న్యాయవాది, కడియం శ్రీహరి తరపు అడ్వొకేట్ను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు.
ఎమ్మెల్యే దానం నాగేందర్కు వ్యతిరేకంగా పాడి కౌశిక్ రెడ్డి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై శుక్రవారం స్పీకర్ ముందు సుదీర్ఘ వాదనలు జరిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఇద్దరు పిటిషనర్ల తరపు న్యాయవాదులను దానం నాగేందర్ తరపు న్యాయవాది క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. అయితే ఆ విచారణ సందర్భంగా సరైన ఆధారాలు సమర్పించలేదన్న కారణంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆ పిటిషన్ల విచారణను మార్చి 2వ తేదీకి వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో నేడు జరగబోయే కడియం శ్రీహరి (Kadiyam Srihari) పిటిషన్ విచారణలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయన్నది ఉత్కంఠగా మారింది.

