కలం, వెబ్ డెస్క్: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు (Delhi Liquor Policy Case)లో కల్వకుంట్ల కవిత (Kavitha)కు రౌస్ అవెన్యూ కోర్ట్ క్లీన్ చిట్ ఇవ్వడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఎక్స్ వేదికగా వినూత్న రీతిలో స్పందించారు. ‘ఎట్టకేలకు కవిత గారికి న్యాయం జరిగింది’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. గతంలో ఎన్నడూ కేటీఆర్ కవితను ‘గారు’ అని సంబోధించిన దాఖలాల్లేవు. ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ‘కవిత గారు’ అని తన పోస్టులో రాయడం ఆసక్తికరంగా మారింది. అలాగే తమ నేతలపై నమోదయ్యే ప్రతి కేసులో ఇలాగే జరుగుతుందని చెప్పారు. రాజకీయ దురుద్దేశంతో ఎన్ని కేసులు పెట్టినా చివరికి న్యాయమే గెలుస్తుందన్నారు. నిజం వెలుగులోకి రాకముందే కాంగ్రెస్, బీజేపీలు అనవసర ఆరోపణలు చేసి ప్రజలను తప్పుదారి పట్టించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం “లిక్కర్ స్కామ్” కారణంగానే పడిపోయిందని కేటీఆర్ అన్నారు. ఈ రాజకీయ కుట్రలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితికి ఎదురుదెబ్బ తగిలిందని చెప్పారు. దురదృష్టవశాత్తూ సాక్ష్యాలను పక్కన పెట్టి, ఆరోపణలు ప్రాధాన్యత పొందడం నవ భారతంలో కొత్త సాంప్రదాయంగా మారిందని పేర్కొన్నారు. మీడియా కథనాలు కూడా న్యాయ ప్రక్రియ జరగక ముందే కథనాలు ప్రచారం చేస్తున్నాయని, ఎవరెన్ని చేసినా చివరకు న్యాయమే గెలుస్తుందని స్పష్టం చేశారు.

