కలం, స్పోర్ట్స్ : టీ20 ప్రపంచకప్ 2026లో వరుస డకౌట్లతో ఇబ్బంది పడ్డ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ, జింబాబ్వేపై మెరుపు ఇన్నింగ్స్తో తిరిగి ఫామ్లోకి వచ్చారు. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో గురువారం జరిగిన కీలక మ్యాచ్లో ఆయన కేవలం 30 బంతుల్లో 55 పరుగులు చేసి భారత్ భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఈ ప్రదర్శనపై మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ (Harbhajan Singh) స్పందిస్తూ, అభిషేక్ కష్టకాలాన్ని దాటేశారని అభినందించారు.
తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడిన హర్భజన్ (Harbhajan Singh), అభిషేక్ ధైర్యంగా ఆడే ఆటగాడని చెప్పారు. గత మ్యాచ్ల్లో తొందరపడి షాట్లు ఆడి అవుట్ అయిన ఆయన, ఈసారి మాత్రం ఆరంభంలో ఓర్పుతో ఆడి తర్వాత దూకుడును పెంచారని వివరించారు. ఈ ఇన్నింగ్స్తో గత వైఫల్యాల జ్ఞాపకాలు దూరమయ్యాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఆదివారం కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో వెస్టిండీస్తో జరగనున్న వర్చువల్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్కు ముందు అభిషేక్ ఫామ్లోకి రావడం జట్టుకు పెద్ద ఊరటగా మారింది. కీలక సమయంలో యువ ఆటగాళ్లు రాణించడం టీమిండియా ఆత్మవిశ్వాసాన్ని పెంచుతోంది.
జింబాబ్వేతో మ్యాచ్కు ముందు అభిషేక్ ఫామ్ జట్టుకు ఆందోళన కలిగించింది. గత నాలుగు మ్యాచ్ల్లో ఆయన కేవలం 15 పరుగులే చేశారు. బ్యాటింగ్ క్రమంలో మార్పులతో సంజూ శాంసన్తో కలిసి ఓపెనింగ్కు వచ్చిన అభిషేక్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడారు. తన ఇన్నింగ్స్లో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 183.33 స్ట్రైక్ రేట్ నమోదు చేశారు. అభిషేక్ అవుట్ అయ్యే సమయానికి భారత్ స్కోరు 150 పరుగులు దాటింది. తర్వాతి ఓవర్లలో బ్యాటర్లు మరింత వేగంగా పరుగులు సాధించారు. నిర్ణీత ఓవర్లలో భారత్ 256 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఏడు ఇన్నింగ్స్ల తర్వాత అభిషేక్ సాధించిన తొలి హాఫ్ సెంచరీ ఇదే.

