కలం, వెబ్ డెస్క్ : రాజకీయ కుట్రలను ఛేదించి కడిగిన ముత్యంలా బయటపడ్డానని కల్వకుంట్ల కవిత (Kavitha) అన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో కోర్టు తీర్పు అనంతరం కవిత మీడియాతో మాట్లాడారు. గతంలో తాను చెప్పిన విషయాలే ఇప్పుడు నిజమయ్యాయని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, కేవలం రాజకీయ ప్రోద్బలంతోనే తనపై తప్పుడు కేసులు నమోదు చేశారని ఆమె అన్నారు. ఐదున్నర నెలల పాటు తనను జైల్లో ఉంచి కుటుంబానికి దూరం చేసి తీవ్రమైన మానసిక క్షోభకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
దాదాపు నాలుగున్నరేళ్ల పాటు ఈ కేసు తనను, తన కుటుంబాన్ని మానసిక వేదనకు గురిచేసిందని కవిత (Kavitha) పేర్కొన్నారు. తన తండ్రి కేసీఆర్ గతంలోనే ఇది రాజకీయ కుట్ర అని చెప్పారని, నేడు కోర్టు తీర్పుతో ఆ విషయం స్పష్టమైందని ఆమె వివరించారు. తనపై దుష్ప్రచారం చేసిన వారు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ఆమె ప్రశ్నించారు. ఈ కష్టకాలంలో తనకు అండగా నిలిచిన జాగృతి కార్యకర్తలు, తన తల్లిదండ్రులు, భర్త, కుటుంబ సభ్యులు, బంధువులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
రాజకీయ దురుద్దేశంతో పెట్టిన ఈ కేసు నుంచి తాను కడిగిన ముత్యంలా బయటకు వచ్చానని, అంతిమంగా న్యాయమే గెలిచిందని ఆమె పేర్కొన్నారు. కోర్టు తీర్పు వెలువడిన అనంతరం స్పందించిన కవిత ఆమె ట్విట్టర్ అకౌంట్ లో ‘సత్యమేవ జయతే’ అంటూ పోస్టు పెట్టారు.
Read Also : కవితకి క్లీన్ చిట్.. హరీశ్రావు వర్గం కొత్త ఎత్తుగడ?
Follow Us On: Sharechat

