కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ శాసనమండలి (Legislative Council) లో రాయలసీమ ఎత్తిపోతల పథకం(Rayalaseema Lift Irrigation Project) పై తీవ్ర గందరగోళం నెలకొంది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర ఆరోపణలు చోటుచేసుకోవడంతో సభలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. రాయలసీమకు నీటిని అందించే అంశంపై చర్చ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్సీలు మాట్లాడారు. శ్రీశైలం నుంచి 800 అడుగుల నీళ్లు రావడానికి గత వైసీపీ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు ప్రవేశపెట్టిందని వారు తెలిపారు. ఈ ప్రాజెక్టు రాయలసీమ ప్రాంతానికి ప్రాణాధారమని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) తెలంగాణతో లాలూచీ పడ్డారని ఆరోపించారు. రాయలసీమ ప్రయోజనాలను కాపాడటంలో విఫలమయ్యారని విమర్శించారు. వైసీపీ సభ్యుల వ్యాఖ్యలను కూటమి నేతలు తీవ్రంగా ఖండించారు. మంత్రి నిమ్మల రామనాయుడు (Nimmala Rama Naidu) మాట్లాడుతూ, వైసీపీ పాలనలో ప్రాజెక్టులు నిలిచిపోయాయని.. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై అనవసర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ వివాదంతో మండలిలో కొంతసేపు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

