కలం, వెబ్ డెస్క్: ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ (IPS Sunil Naik)పై గుంటూరు మొబైల్ కోర్టు నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. రఘురామ కృష్ణ రాజు కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించి ఈ ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో సునీల్ నాయక్ హాజరు కాకపోవడంతో పాటు దర్యాప్తుకు సహకరించడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ఆయనను అరెస్ట్ చేయడానికి ఏపీ పోలీసులు బీహార్ రాష్ట్రంలోని పాట్నా వెళ్లారు. అయితే అక్కడి నుంచి ఏపీకి తరలించేందుకు అవసరమైన ట్రాన్సిట్ వారంట్ జారీ చేయాలని కోరగా పాట్నా హైకోర్టు ఆ అభ్యర్థనను తిరస్కరించింది. దీంతో ఏపీ పోలీసులు గుంటూరు కోర్టును ఆశ్రయించి నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. కేసు వివరాలను పరిశీలించిన కోర్టు సునీల్ నాయక్పై వారంట్ జారీ చేసింది. ఇప్పటికే ఈ కేసు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. రఘురామ కృష్ణ రాజు కస్టోడియల్ టార్చర్ ఆరోపణలు వెలుగులోకి వచ్చిన తర్వాత ఈ అంశం చర్చనీయాంశమైంది. కోర్టు వారంట్ జారీ చేయడంతో సునీల్ నాయక్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచడానికి పోలీసులు చర్యలు చేపట్టారు.

