కలం, వరంగల్ బ్యూరో : వరంగల్ (Warangal) రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య పొలిటికల్ వార్ రాజుకుంది. ఇటీవల భద్రకాళీ మాడ వీధుల విస్తరణలో భాగంగా పరిసరాల్లో అడ్డుగా ఉన్న పలు దుకాణాలను తొలగించారు. ఇందులో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తల షాపులు ఉండటం వివాదానికి కారణమైంది. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఉద్దేశపూర్వకంగానే దళితులైన బీఆర్ఎస్ కార్యకర్తల షాపులను తొలగిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య వైరం మొదలైంది. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ వ్యాఖ్యలను ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తప్పుబట్టారు. మాజీ ఎమ్మెల్యే తన స్వార్థ రాజకీయాల కోసం అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే వ్యాఖ్యలతో బీఆర్ఎస్ నేతల ఆగ్రహం
వరంగల్ (Warangal) పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ మధ్య పొలిటికల్ వార్ తారాస్థాయికి చేరింది. కొద్ది రోజులుగా వీరిద్దరూ ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. గతంలో భద్రకాళీ చెరువు పూడికతీత పనుల సందర్భంగా వీరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం నడిచింది. ఈ విషయంలో అప్పట్లో మాజీ మంత్రి కేటీఆర్ సైతం స్పందించడం సంచలనం కలిగించింది. ఆ వివాదం సద్దుమణిగిందనుకునే లోపే మాడ వీధుల విస్తరణ పంచాయితీ మొదలైంది.
మరోవైపు, రెండు రోజుల క్రితం బీఆర్ఎస్ కార్పొరేటర్ ఒకరు కాంగ్రెస్ కార్యకర్తపై కత్తితో దాడి చేసి గాయపరచడం కలకలం రేపింది. ఈ సంఘటనను సీరియస్ గా తీసుకున్న ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి వరంగల్ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ నగరంలో ప్రశాంతతకు భంగం కలిగిస్తున్నారని, ఆయనపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఆయనను నగర బహిష్కరణ చేయాలని కోరారు. ఎమ్మెల్యే చేసిన ఈ వ్యాఖ్యలు వరంగల్ నగరంలో సంచలనం రేపాయి. దీంతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నాయినిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

