కలం, వెబ్ డెస్క్: మాఫియా లీడర్, డ్రగ్ డాన్ ఎల్ మెంచో హతం (El Mencho Killing) కావడంతో మెక్సికో అల్లకల్లోలంగా మారింది. ఆయన అనుచరులు తీవ్ర విధ్వంసానికి పాల్పడుతున్నారు. షాపులు, వెహికల్స్ తగలబెడుతున్నారు. లూటీలకు పాల్పడుతున్నారు. అడ్డుకున్న వాళ్లపై దాడులకు తెగబడుతున్నారు. హత్యలు చేస్తున్నారు. దీంతో మెక్సికోలో భీతావహ పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ఆ దేశంలో నివసించే భారతీయులకు కేంద్ర ప్రభుత్వం అడ్వైజరీ జారీ చేసింది. ఇండియన్ ఎంబసీ ‘ఎక్స్’లో ఇండియా ఇన్ మెక్సికో అకౌంట్ ద్వారా భారత పౌరులకు పలు సూచనలు ఇస్తూ ట్వీట్ పోస్ట్ చేసింది.
ఇళ్లలోనే ఉండాలని, ప్రయాణాలను సాధ్యమైనంతగా తగ్గించుకోవాలని కోరింది(El Mencho Killing). జనసమ్మర్థం ఉండే, అల్లర్లు జరిగే ప్రాంతాలకు ఎట్టి పరిస్థితుల్లో వెళ్లకూడదని హెచ్చరించింది. పరిసరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించింది. స్థానిక మీడియా ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితి గురించి తెలుసుకోవాలని చెప్పింది. స్థానిక అధికారులు ఇచ్చే సూచనలు పాటించాలని, అత్యవసర పరిస్థితులు తలెత్తితే 911 నెంబర్కు కాల్ చేయాలని కోరింది. మీరుంటున్న చోటు, అక్కడి పరిస్థితులకు గురించి ఎప్పటికప్పుడు కుటుంబసభ్యులకు ఫోన్, మెసేజ్ లేదా సోషల్ మీడియా సమాచారం అందించాలని కోరింది. ఏదైనా సహాయం కావల్సి వస్తే భారత ఎంబసీని +52554847 నెంబరులో సంప్రదించాలని సూచించింది.


