కలం, వెబ్ డెస్క్: రాజమండ్రి (Rajahmundry)లో కల్తీ పాల (Adulterated Milk) ఉదంతం తీవ్రరూపం దాల్చుతోంది. ఇప్పటికే ఈ కల్తీ పాలకు ఇద్దరు బలవ్వగా, తాజాగా సోమవారం మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య ఐదుకు చేరుకుంది. పట్టణంలోని చౌడేశ్వరి, వెంకటేశ్వరనగర్ కాలనీల్లో గణేష్ అనే వ్యక్తి పాలు పోస్తున్నాడు. ఈ పాలు తాగి చాలామంది అస్వస్థతకు గురవుతున్నారు. ప్రస్తుతం కాలనీలకు చెందిన వారు పదుల సంఖ్యలో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అనూహ్యంగా అందరూ డయేరియా, కిడ్నీ సమస్యలతోనే అనారోగ్యం పాలు కావడంతో విషయం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే పోలీసులు పాల వ్యాపారి గణేష్ను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. మరోవైపు కలెక్టర్ ఆదేశాలతో పాల శాంపిల్స్ను పరీక్షించేందుకు హైదరాబాద్ పంపించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. కల్తీ పాలతోనే మరణాలు సంభవించినట్లు ప్రాథమికంగా భావిస్తున్నామన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో చిన్న పిల్లలు కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.


