కలం, నాగార్జునసాగర్ : అంతర్జాతీయ ప్రమాణాలతో నాగార్జునసాగర్ లో (Nagarjuna Sagar) ప్రభుత్వం నిర్మించిన బుద్ధవనాన్ని ఆదివారం సౌత్ కొరియా బుద్ధిష్ట్ స్టడీస్ నేషనల్ యూనివర్సిటీ ప్రతినిధులు సందర్శించారు. హైదరాబాదులో ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న వీరు బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య సూచన మేరకు ఆదివారం ఇక్కడకు వచ్చారు. సౌత్ కొరియా నేషనల్ యూనివర్సిటీకి చెందిన విద్యా సాంస్కృతిక ప్రతినిధుల బృందం కాంగ్ సుంగ్ యోంగ్, చోయ్ సేంగహో, మిన్ క్యేయోంగ్ వూ, కవన్ జిన్ వోక్, శేషు, చిరాగ్ జలది తదితరులు ఇందులో ఉన్నారు.
బుద్ధునికి పుష్పాంజలి ఘటించి, బుద్ధ చరిత వనం, జాతకవనం, ధ్యాన వనం, స్థూప స్తూపవనాలను సందర్శించారు. స్థూప వనములో నిర్మించిన సౌత్ కొరియా మహాస్థూపాన్ని సందర్శించారు. అనంతరం సమావేశ మందిరంలో బుద్ధవనం విశేషాలను తెలిపే షార్ట్ ఫిల్మ్ ను చూశారు. ధ్యాన మందిరంలో బుద్ధవనం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శాసన, ఎస్టేట్ మేనేజర్ రవిచంద్ర, బుద్ధవనం ఆర్ట్స్ అండ్ ప్రమోషన్స్ మేనేజర్ శ్యాంసుందర్రావులు కండువాలతో, బ్రోచర్లతో ప్రతినిధులను సత్కరించారు. వీరితోపాటు స్థానిక టూరిజం గైడ్ సత్యనారాయణ తదితరులు ఉన్నారు.


