కలం, వరంగల్ బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డికి వరంగల్ జిల్లాలో పర్యటించే అర్హత లేదంటూ బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి (Peddi Sudarshan Reddy) విమర్శించారు. శనివారం హనుమకొండలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి, మంత్రులు వరంగల్ జిల్లాకు విహారయాత్రకు వస్తున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి, మంత్రుల పర్యటనతో రైతులకు ఒరిగేది ఏమీ లేదన్నారు. రెండు సంవత్సరాలుగా దేవాదుల ప్రాజెక్టులో తట్టెడు మట్టి తీయలే, సుక్క నీరు ఇవ్వలేదని మండిపడ్డారు. దేవాదుల ప్రాజెక్టును (Devadula Project) రెండు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని అసెంబ్లీ ఎన్నికలలో హామీ ఇచ్చి జిల్లా రైతులను మోసం చేసి గెలిచింది కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు.
దేవాదులకు వారే శాపం
ముఖ్యమంత్రి, మంత్రుల వైఫల్యం దేవాదుల ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు శాపంగా మారిందన్నారు. దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేస్తామని హామీ ఇచ్చి రెండు సంవత్సరాలు గడిచిందని, ఒక్క పంపుహౌస్ను సరిగా నడపలేక పోతున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం, జిల్లా మంత్రుల నిర్లక్ష్యం వల్ల వరంగల్ జిల్లా రైతులకు దేవాదుల నీళ్లు సరిపడా అందడం లేదన్నారు. మాజీ మంత్రి హరీశ్రావు పర్యటనతో ఈ ప్రభుత్వం నిద్రలేచిందన్నారు. గోదావరి నదిలో సరిపడా నీళ్లు ఉన్నా, ప్రభుత్వ నిర్లక్ష్యంతో గోదావరి నీళ్లను రైతులకు అందించడం లేదన్నారు.
అసమర్థ ప్రభుత్వం
ఒక్క సాగునీటి ప్రాజెక్టును కూడా పూర్తిచేసి రైతులకు సాగునీరు ఇవ్వలేని అసమర్ధ ప్రభుత్వమన్నారు. 90 శాతం ప్రాజెక్టు పనులను కేసీఆర్ ప్రభుత్వం పూర్తి చేస్తే రెండున్నర సంవత్సరాలుగా ఒక్క శాతం పని కూడా రేవంత్ రెడ్డి సర్కార్ చేయలేకపోయిందని సుదర్శన్ రెడ్డి విమర్శించారు. పంట కాలువల కోసం భూ సేకరణ చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కేసీఆర్ పైన మొరగడానికే ముఖ్యమంత్రికి, మంత్రులకు రెండు సంవత్సరాలు సరిపోయిందన్నారు. రాబోవు పరిషత్ ఎన్నికలలో రైతులు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెబుతారని, ఓటమి భయంతో ముఖ్యమంత్రి ప్రాజెక్టు పేరుతో వరంగల్ జిల్లా పర్యటన చేస్తున్నాడని పెద్ది సుదర్శన్ రెడ్డి (Peddi Sudarshan Reddy) విమర్శించారు.
Read Also: రాజకీయ నేతలు అసహ్యంగా మాట్లాడుతున్నారు : వెంకయ్య నాయుడు
Follow Us On: Sharechat


