కలం, వెబ్ డెస్క్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సోషల్ మీడియా వేదికగా మరోసారి తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తాను ఎంతో వ్యతిరేకత మధ్య సుప్రీంకోర్టుకు నియమించిన ఇద్దరు న్యాయమూర్తులు, నీల్ గోర్సచ్, అమీ కోనీ బారెట్ వ్యవహరించిన తీరుపై ఆయన తీవ్ర అసంతృప్తిని వెల్లడించారు. ప్రజాభిప్రాయంతో సంబంధం లేకుండా వారు తీసుకున్న నిర్ణయం తనను విస్మయానికి గురిచేసిందని ఆయన పేర్కొన్నారు.
డెమొక్రాట్లు ఎప్పుడూ తమ వర్గానికి వ్యతిరేకంగా ఓటు వేయరని, కానీ రిపబ్లికన్ల విషయంలో మాత్రం ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నాయని ట్రంప్ విమర్శించారు. ఎంత బలమైన వాదనలు వినిపించినా డెమొక్రాట్లు ఏకతాటిపై ఉంటారని, తమకు అనుకూలంగానే ఓటు వేస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదే క్రమంలో చీఫ్ జస్టిస్ రాబర్ట్స్ను కూడా ఆయన విడిచిపెట్టలేదు. విదేశీ శక్తులు అమెరికాను దోచుకోవడానికి రాబర్ట్స్ సహకరించారని, కనీసం ఆయనను తాను నియమించలేదనే విషయాన్ని గుర్తు చేసుకున్నారు.
అయినప్పటికీ విదేశీ దోపిడీని తాము అనుమతించబోమని ట్రంప్ (Donald Trump) తెలిపారు. చట్టపరంగా పరీక్షించబడిన కొత్త టారిఫ్లు త్వరలోనే అమలులోకి రాబోతున్నాయని ఆయన ప్రకటించారు. దీని ద్వారా అమెరికా ప్రయోజనాలను కాపాడుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.


