కలం, మెదక్ బ్యూరో: పంటలకు సకాలంలో నీరు అందకపోవడంతో ఆగ్రహించిన రైతులు పురుగుల మందు డబ్బాలు చేతబట్టి రాస్తారోకోకు దిగారు. ఈ ఘటన మెదక్ (Medak) జిల్లాలో జరిగింది. పులిమామిడి-గజ్వేల్ ప్రధాన రహదారిపై నిజాంపేట్ మండలం కె.వెంకటాపూర్ గ్రామ రైతులు ఆందోళనకు దిగారు. కొండపోచమ్మ ప్రాజెక్టు ద్వారా సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమయానికి నీరు అందక వరి, మక్క, ఇతర పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
నీటి విడుదల కోసం అధికారులకు మొర పెట్టుకున్నా సంద్పించడం లేదని ఆరోపించారు. వెంటనే నీటిని ఇవ్వకపోతే నిరసనలు చేపడతామని రైతులు (Farmers) హెచ్చరించారు. సమాచారం అందుకున్న చేగుంట తహసీల్దార్ శివప్రసాద్, ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ అధికారులు రైతులతో చర్చలు జరిపారు. ఉన్నతాధికారులతో మాట్లాడి త్వరలోనే నీటిని విడుదల చేయించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.


