కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం(Bhadrachalam)లో మార్చి 27 న అంగరంగ వైభవంగా శ్రీరామ నవమి (Sri Rama Navami) జరగనుంది. శ్రీరామ నవమి రోజున రాములవారి కళ్యాణానికి అవసరమైన తలంబ్రాలను వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తెస్తుంటారు. ముఖ్యంగా ఈ తలంబ్రాలను చేతితో వడ్లను ఒలిచి (Hand Peeled Talambralu) తయారు చేస్తారు. ఈ సమయంలో భక్తులు ఎంతో నిష్ఠగా ఉంటారు. నోటి తుంపర్లు పడకుండా నోటికి అడ్డంగా వస్త్రం కట్టుకుంటారు. వడ్లను ముక్కలు కాకుండా జాగ్రత్తగా ఒలుస్తారు.
ఒలిచేటప్పుడు భజనలు చేస్తూ శ్రీరామ నామాన్ని స్మరిస్తుంటారు. మాంసాహారం భుజించరు.. చెప్పులు ధరించరు. ఈ విధంగా నిష్ఠతో కోటి అక్షింతలు తయారు చేసి అనంతరం తలలపై తలంబ్రాలను మోస్తూ, కాలి నడకన భద్రాచలం(Bhadrachalam) చేరుకొని దేవాలయంలో సమర్పిస్తారు. చేతితో తలంబ్రాలు ఒలవడం ఒక ఎత్తైతే సాగు చేయడం మరో ఎత్తు. తలంబ్రాల కోసం పండించే వడ్లను చాలా పవిత్రంగా సాగు చేస్తారు. రసాయన ఎరువులు ఉపయోగించరు. సేంద్రియ ఎరువులు మాత్రమే ఉపయోగిస్తారు. పంట చేతికి వచ్చాక ఊరిలోని మహిళలు, పురుషులు అంతా కలిసి ఒక యజ్ఞంలా వడ్లను గోళ్ళతో ఒలుస్తారు.
ధర్మ జాగరణ సమితి సహా సంయోజక్ ఏం.వి సుబ్రమణ్యం(సారపాక)
భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లాలోని సుజాత నగర్కు చెందిన చిట్లూరి కిషోర్ దంపతులతో పాటు వంద మంది భక్తులు శ్రీరామ నామం జపిస్తూ పంటను వేశారు. పంట చేతికి వచ్చిన తర్వాత కొన్ని వడ్లను భద్రాచల రాముల వారి పాదాల చెంత ఉంచి పూజలు జరిపించారు. సుమారు 100 కేంద్రాల్లో భక్తుల సహాయ సహకారాలతో నిత్యం రామ నామ స్మరణతో వడ్లను ఒలుస్తూ, తలంబ్రాలు చేస్తున్నారు. గడిచిన 30 రోజుల నుంచి ఈ తంతు నిర్వహిస్తున్నారు. మార్చి 4వ తేదీన వసంతోత్సవం నాడు వివిధ ప్రాంతాల నుండి 2500 మంది గోటి తలంబ్రాలు పట్టుకుని భద్రాచలం(Bhadrachalam) చేరుకుంటారు.


