కలం, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మదనపల్లె (Madanapalle) ఏడేళ్ల చిన్నారి హత్య కేసు (Child Murder Case)లో కీలక మలుపు చోటు చేసుకుంది. కురబలకోట మండలం కనసానివానిపల్లెలోని చెరువులో నిందితుడు కులవర్ధన్ మృతదేహం లభ్యమైంది. ముదివేడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. నిందితుడు ఆత్మహత్య చేసుకొని ఉంటాడని భావిస్తున్నారు. రెండు రోజుల క్రితం కులవర్ధన్ బాలికను హత్య చేసి డ్రమ్ములో మృతదేహాన్ని కుక్కిపెట్టాడు. మంగళవారం మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రిలో చిన్నారి మృతదేహానికి పోస్టుమార్టం చేయగా చిన్నారిపై అత్యాచారం జరిగిందని వైద్యులు నిర్ధారించారు. అత్యాచారం తర్వాత చిన్నారిని నీళ్ల డ్రమ్ములో ముంచి హత్య చేశాడని డీఐజీ కోయ ప్రవీణ్ వెల్లడించారు. నిందితుడిని తమకు అప్పగించాలని మంగళవారం బాలిక బంధువులు తీవ్ర ఆందోళన చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో నిందితుడి మృతదేహం లభ్యమవడం చర్చనీయాంశంగా మారింది.


