కలం, వెబ్ డెస్క్: పెళ్లి బాజాలకు వేళ అయ్యింది. మూడు నెలలుగా నిశ్శబ్దంగా ఉన్న కల్యాణ మండపాలు మళ్లీ సందడిగా మారబోతున్నాయి. ఫిబ్రవరి 17తో శుక్ర మూఢమి ముగియనుండటంతో ఫిబ్రవరి 18 నుంచి వివాహాలకు శుభముహుర్తాలు (Marriage Season) ప్రారంభమవుతున్నాయి. మాఘ మాసం అంటేనే పెళ్లిళ్ల కాలం. అయితే ఈసారి శుక్ర మూఢమి కారణంగా పెళ్లిళ్లు ఆగిపోయాయి. పెళ్లి కోసం వేచి ఉన్న కుటుంబాలు తేదీల కోసం ఎదురు చూశాయి. ఇప్పుడు ఆ నిరీక్షణకు ముగింపు కనిపిస్తోంది.
జ్యోతిష్యం ప్రకారం శుక్రుడు వివాహం, దాంపత్య సౌఖ్యం, ఐశ్వర్యానికి కారకుడు. శుక్రుడు సూర్యునికి సమీపంగా చేరి అస్తమయ స్థితిలోకి వెళ్లినప్పుడు ఆ కాలాన్ని శుక్ర మౌఢ్యం అంటారు. ఈ సమయంలో శుభకార్యాలు చేయడం అనుకూలం కాదని పండితులు చెబుతారు. ఫిబ్రవరి 17తో ఈ దశ ముగుస్తోంది. ఫిబ్రవరి 18, బుధవారం నుంచి వివాహాలు, గృహప్రవేశాలు, ఉపనయనాలు వంటి కార్యక్రమాలకు ముహుర్తాలు అందుబాటులోకి వస్తున్నాయి. చాలా కాలంగా ఆగిపోయిన పెళ్లి ఏర్పాట్లు మళ్లీ వేగం అందుకునే పరిస్థితి కనిపిస్తోంది.
ఫిబ్రవరి 18 నుంచి మే 9 వరకు మాత్రమే శుభ ముహుర్తాలు ఉన్నాయి. మే 17 నుంచి అధిక మాసం ప్రారంభమవుతుందని, దాంతో మళ్లీ శుభకార్యాలకు విరామం ఉంటుందని జ్యోతిష్యవేత్తలు తెలిపారు. ఈ ఏడాది పెళ్లి చేసుకోవాలనుకునే వారు ఈ గడువును దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుంది. పండితులు మరో ముఖ్య సూచన చేశారు. శుక్ర మూఢమి ముగిసిందని మాత్రమే చూసి తొందరపడకూడదని తెలిపారు.
వధూవరుల వ్యక్తిగత జాతకాలను పరిశీలించి ముహూర్తం నిర్ణయించుకోవాలని సూచించారు. గృహప్రవేశం వంటి కార్యక్రమాలయితే ఇంటి యజమాని జాతకాన్ని పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొన్నారు. మొత్తం మీద, పెళ్లి వేడుకల (Marriage Season) కోసం ఎదురు చూస్తున్న కుటుంబాలకు ఇది శుభవార్త. తేదీలు స్పష్టంగా ఉన్నాయి. సమయం పరిమితంగా ఉంది. ఇప్పుడు ఏర్పాట్లకు శ్రీకారం చుట్టే సమయం వచ్చింది.
Read Also: జీవన్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్.. పార్టీ మారబోతున్నారా?
Follow Us On: Instagram


