కలం, వెబ్ డెస్క్: కొత్తగూడెం (Kothagudem) కార్పొరేషన్ పదవిని చేజిక్కించుకుంటామని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. ఈ కార్పొరేషన్ స్థానంలో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాలేదు. కొత్తగూడెం కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో మొత్తం 60 స్థానాలు ఉండగా ఏ పార్టీకి పూర్తి మెజార్టీ దక్కలేదు. కాంగ్రెస్ 22, సీపీఐ 22, బీఆర్ఎస్ 8, ఇతరులు 6, బీజేపీ 1, సీపీఎం ఒక సీటు సాధించడంతో స్పష్టమైన మెజారిటీ లేకపోవడం రాజకీయ వాతావరణాన్ని గందరగోళంగా చేసింది. స్వతంత్రులు, బీఆర్ఎస్ పార్టీ మద్దతు అత్యంత కీలకంగా మారింది. ఎన్నికల సమయంలో తమ పార్టీ అభ్యర్థికి డిప్యూటీ మేయర్ పదవి ఇస్తే తాము పొత్తు పెట్టుకుంటామని సీపీఐ స్పష్టం చేసింది. అయితే అందుకు కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోలేదు. దీంతో సీపీఐ, కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేశాయి. సీపీఐకి తాము మద్దతు ఇస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. బీఆర్ఎస్ మద్దతుతో సీపీఐ మేయర్ పదవి దక్కించుకునే అవకాశం ఉంది. కూనంనేని జాతీయ స్థాయిలో పార్టీ పెద్దలతో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. మరి ఆయన బీఆర్ఎస్ పార్టీ మద్దతు తీసుకుంటారా? లేదా? అన్నది వేచి చూడాలి. ఇక గిరిజన మహిళకు మేయర్ పదవి ఇస్తామని కూడా కూనంనేని ప్రకటించారు.


