కలం, వెబ్ డెస్క్: జమ్మూకశ్మీర్లోని శ్రీనగర్ సహా పలు ప్రాంతాల్లో భద్రతా బలగాలు హై అలర్ట్ ప్రకటించాయి. దేశాన్ని కుదిపేసిన పుల్వామా ఉగ్రదాడి (Pulwama Attack) జరిగి నేటికి (ఫిబ్రవరి 14) ఎనిమిదేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. 2019 ఫిబ్రవరి 14న జమ్మూ నుంచి శ్రీనగర్ వైపు వెళ్తున్న సీఆర్పీఎఫ్ (CRPF) సైనికుల కాన్వాయ్పై ఉగ్రవాదులు ఆత్మహుతి దాడికి పాల్పడ్డారు. పుల్వామా జిల్లా లేథిపూర ప్రాంతంలోని ఆవంతిపురా సమీప మలుపు వద్ద భారీ పేలుడు పదార్థాలతో నిండిన వాహనాన్ని కాన్వాయ్లోకి దూసుకెళ్లించి దాడి చేశారు. ఈ పేలుడులో మొత్తం 40 మంది సీఆర్పీఎఫ్ సైనికులు అమరులయ్యారు.
పుల్వామా (Pulwama Attack) ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించడంతో పాటు జాతీయ భద్రతా వ్యవస్థను కుదిపేసింది. అనంతరం భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు. దాడి జరిగి ఎనిమిదేండ్లు పూర్తయిన సందర్భంగా భద్రతా బలగాలు అలర్ట్ అయ్యాయి. ఉగ్రమూకల రెచ్చిపోయే ప్రమాదం ఉందన్న సమాచారంతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. శ్రీనగర్, పుల్వామా, ఆవంతిపురా సహా సున్నిత ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. వాహనాల తనిఖీలు పెంచడంతో పాటు కీలక ప్రాంతాల్లో నిఘాను బలోపేతం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని భద్రతా అధికారులు సూచించారు. అమరులైన జవాన్లకు దేశవ్యాప్తంగా నివాళులు అర్పిస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో స్మారక కార్యక్రమాలు నిర్వహిస్తూ వారి త్యాగాన్ని స్మరించుకుంటున్నారు.


