కలం, వెబ్ డెస్క్: 2026 మార్చి 31 నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే కేంద్ర బలగాలు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో మెరుపు దాడులు చేస్తూ మావోయిస్టులను మట్టుబెడుతున్నాయి. ముఖ్యంగా మావోయిస్టుల ప్రధాన కేంద్రమైన ఛత్తీస్గఢ్ (Chhattisgarh)పై ప్రత్యేక నిఘాను పెట్టాయి. ఈ నేపథ్యంలో గడిచిన 14 నెలల్లో (జనవరి 2024 నుంచి) భద్రతా దళాలు జరిపిన ఆపరేషన్లో 532 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఇదే సమయంలో 2,004 మందిని అరెస్ట్ కాగా, 2,700 మంది నక్సలైట్లు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిశారు. గతంతో పోలిస్తే అరెస్టుల కంటే లొంగుబాట్లు ఎక్కువగా ఉన్నాయి. ఈ మేరకు డిప్యూటీ సీఎం విజయ్ శర్మ శుక్రవారం కీలక విషయాలను వెల్లడించారు.
నక్సల్స్ నెట్వర్క్ను దెబ్బతీయడంలో భాగంగా పోలీసులు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో సుమారు 1,100 అధునాతన ఆయుధాలు ఉన్నాయి. వాటిలో ఏకే-47లు, ఇన్సాస్ రైఫిల్స్, ఎల్ఎంజీలు (LMG), మోర్టార్లు, పిస్టల్స్ ఉన్నాయి. ఈ ఆపరేషన్లలో ప్రధానంగా ఆరుగురు పొలిట్బ్యూరో, సెంట్రల్ కమిటీ సభ్యులు మరణించగా, 17 మంది స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి.
ఛత్తీస్గఢ్లో (Chhattisgarh) మావోయిజాన్ని (Maoists) పూర్తిగా తుడిచిపెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిర్దేశించిన లక్ష్యం ప్రకారం.. 2026 మార్చి 31 నాటికి ఛత్తీస్గఢ్ను నక్సల్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని విజయ్ శర్మ ధీమా వ్యక్తం చేశారు. లొంగిపోయిన వారికి మొబైల్ ఫోన్లు, రేషన్ కార్డులు, ఆయుష్మాన్ కార్డులు అందిస్తూ గౌరవప్రదమైన జీవితం గడిపేలా ప్రభుత్వం సహకరిస్తోందని ఆయన వెల్లడించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పునరావాస పథకాలు విజయవంతం అవుతున్నాయని ఆయన అన్నారు.
Read Also: భోపాల్లో దారుణం.. మైనర్పై నాలుగు కార్లలో గ్యాంగ్ రేప్
Follow Us On: Pinterest


