కలం, వెబ్ డెస్క్: మహిళలు, అమ్మాయిల భద్రతకు ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు అమలుచేస్తున్నా అత్యాచారాలు ఆగడం లేదు. దేశంలో ఏదో ఒక చోట నిత్యం అత్యాచార ఘటన వెలుగుచూస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో భోపాల్ (Bhopal)లో 11వ తరగతి విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. పోలీసుల వివరాల ప్రకారం.. నిందితులు బాలికను నాలుగు వేర్వేరు కార్లలో తిప్పుతూ ఈ దారుణానికి ఒడిగట్టారు.
బాధితురాలిని బెదిరించి, బలవంతంగా మతం మార్చుకోవాలని ఒత్తిడి చేసినట్లు కూడా అభియోగాలు నమోదయ్యాయి. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న నిందితులపై సామూహిక అత్యాచారం, కిడ్నాప్, మధ్యప్రదేశ్ మత మార్పిడి చట్టం కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.
ఈ కేసులో పోలీసులు (Police) ఇప్పటికే ప్రధాన నిందితులను గుర్తించి విచారణ వేగవంతం చేశారు. నిందితులు బాధితురాలికి తెలిసినవారేనని, వారు పక్కా ప్రణాళికతోనే ఈ దారుణానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని, మహిళల భద్రత విషయంలో కచ్చితమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. బాధితురాలికి ప్రస్తుతం వైద్య సహాయం అందిస్తున్నారు.


