కలం, డెస్క్ : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఒక్క ఓటుతో గెలిచిన అభ్యర్థులు ఇప్పుడు ట్రెండింగ్ లోకి వచ్చేశారు. అదృష్టం వారికి ఒక్క ఓటు రూపంలో దక్కిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటి వరకు మూడు చోట్ల ఒక్క ఓటుతో అభ్యర్థులు గట్టెక్కారు. వారి గురించి ఒకసారి చూద్దాం.
కల్వకుర్తిలో..
కల్వకుర్తి మున్సిపాలిటీలోని పదో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి ఎజాస్ మొదటి సారి లెక్కించినప్పుడు రెండు ఓట్ల తేడాతో గెలుపొందారు. కానీ రీ కౌంటింగ్ చేసినప్పుడు.. ఎజాస్ కు 259 ఓట్లు రాగా, బీఆర్ ఎస్ అభ్యర్థి తాహిర్ కు 258 ఓట్లు వచ్చాయి. దీంతో ఒక్క ఓటు తేడాతో ఎజాస్ గెలిచినట్టు అధికారులు ప్రకటించారు.
కొల్లాపూర్ లో..
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో కాంగ్రెస్ అభ్యర్థి ఒక్క ఓటుతో గెలిచారు. 2వ వార్డు చుక్కాయిపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి జయలక్ష్మికి 355 ఓట్లు వచ్చాయి. బీఆర్ ఎస్ అభ్యర్థికి 354 ఓట్లు వచ్చాయి. రీ కౌంటింగ్ చేసినా ఫలితం మారకపోవడంతో.. జయలక్ష్మి ఒక్క ఓటుతో విజయం సాధించారు.
పరకాలలో..
పరకాల మున్సిపాలిటీ 17వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి బొచ్చు సుభద్రకు 369 ఓట్లు వచ్చాయి. బీఆర్ ఎస్ అభ్యర్థి రజినికి 368 ఓట్లు రావడంతో.. రీ కౌంటింగ్ కు గులాబీ నాయకులు పట్టుబట్టారు. రీ కౌంటింగ్ లో ఒక్క ఓటు తేడాతో సుభద్ర గెలిచినట్టు అధికారులు ప్రకటించారు.


