కలం, వెబ్ డెస్క్: కన్నతండ్రి సంపాందించిన ఆస్తిని లాక్కొని తిండి పెట్టకుండా బయటికి గెంటేసిన ఘటన సికింద్రాబాద్ (Secunderabad)లోని మారేడుపల్లి సెకండ్ లక్ష్మీనగర్ బస్తీలో చోటుచేసుకుంది. కన్నకూతుళ్లే మోసం చేసి రోడ్డుపై పడేశారంటూ ఓ వృద్ధ తండ్రి కన్నీరుమున్నీరవుతున్నాడు. మహాంకాళి రాజలింగం అనే వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యాడు. ఎంతో కష్టపడి సంపాదించిన 130 గజాల స్థలాన్ని తన ముగ్గురు కుమార్తెల పేరిట రాసి ఇచ్చారు. అయితే ఆస్తి చేతికి వచ్చిన తర్వాత కూతుళ్లు తండ్రిని బయటకు గెంటేశారు.
గత ఐదు సంవత్సరాలుగా కనీసం తిండి కూడా పెట్టకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, చివరకు ఇంట్లో నుంచి గెంటేశారని రాజలింగం ఆవేదన వ్యక్తం చేశాడు. దిక్కుతోచని స్థితిలో ఆయన సొంత ఇంటి ముందే ఆందోళనకు దిగాడు. తనకు జరిగిన అన్యాయంపై పోలీసులకు, ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. వృద్ధుడి దీనస్థితిని చూసి చలించిన బస్తీ వాసులు ఆయనకు అండగా నిలిచి ఆశ్రయం కల్పించారు.
వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను (Parents) నిర్లక్ష్యం చేసే ప్రభుత్వ ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇటీవల సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోని పక్షంలో వారి జీతంలో 10 శాతం కోత విధించి, ఆ మొత్తాన్ని వృద్ధులైన తల్లిదండ్రుల ఖాతాలోనే జమ చేస్తామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో బాధితుడు రాజలింగం రెండో కుమార్తె ప్రభుత్వ ఉద్యోగి కావడంతో ఆమెపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.
Read Also: చనిపోయినా కనికరించని కులపెద్దలు.. పాడె మోసిన భార్య
Follow Us On: Instagram


