కలం, వెబ్ డెస్క్: మున్సిపల్ ఎన్నికల వేళ సంగారెడ్డి జిల్లాలో పోలీసుల దాడులతో కలకలం చోటు చేసుకుంది. సంగారెడ్డి (Sangareddy) జిల్లా ఇంద్రేశం మున్సిపాలిటీలోని 6వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి ఐలాపురం నాగరాజుపై మంగళవారం అర్ధరాత్రి పోలీసులు దాడి చేశారు. వివరాల్లోకి వెళ్తే.. రామేశ్వరంబండ వీకర్ సెక్షన్ కాలనీలో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్ కేంద్రం వద్ద బీఆర్ఎస్ పార్టీ నాయకులు పలువురు ఓటర్లకు మద్యం, బిర్యానీ పంచారు. ఇది గమనించిన 6వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి నాగరాజు పోలీసులకు చెప్పి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ క్రమంలో ఓ కానిస్టేబుల్ తనపై దాడి చేసినట్లు నాగరాజు చెప్తున్నాడు. తాను కాంగ్రెస్ ఆరో వార్డు అభ్యర్థినని పోలీసులకు చెబుతున్నా పట్టించుకోకుండా లాఠీతో తనపై దాడి చేశారని వెల్లడించాడు. ప్రస్తుతం పటాన్ చెరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నాగరాజు చికిత్స పొందుతున్నాడు. బీఆర్ఎస్ అభ్యర్థి దాడి చేయించాడని నాగరాజు ఆరోపిస్తున్నాడు.


