కలం, మెదక్ బ్యూరో: మున్సిపల్ ఎన్నికలకు ప్రచారం ముగిసి.. ఎల్లుండి పోలింగ్ జరగనున్న నేపథ్యంలో సిద్దిపేట జిల్లా గజ్వేల్ (Gajwel) మున్సిపాలిటీలో పోస్టర్ల కలకలం రేగింది. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఈ నియోజకవర్గంలోని గజ్వేల్ మున్సిపాలిటికీ ఎల్లుండి ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ ముంపు గ్రామమైన ఏటిగడ్డకిష్టాపూర్ చెందిన 12వ వార్డులో నాన్ లోకల్ బాధితుల సంఘం, అంజన్న భక్తుడు పేరుతో అంటించిన పోస్టర్లు అనేక చర్చలకు దారితీస్తున్నాయి.
ఏటిగడ్డకిష్టాపూర్ ముంపు గ్రామాల్లో గతంలో జరిగిన అవినీతి, అక్రమాలు, అధికార దుర్వినియోగం గురించి పోస్టర్లలో ప్రస్తావించారు. ప్రధాన కూడలితో పాటు పలు ఇండ్లకు వీటిని అతికించారు. ఊరు నుంచి బతుకుదెరువు కోసం వెళ్లిన వాళ్ళని ‘నాన్ లోకల్’ అని ముద్రవేసి, వాళ్లకు వచ్చే ప్యాకేజీ, ప్లాట్ల విషయంలో జరిగిన అవకతవకల గురించి వాటిలో రాశారు. భూనిర్వాసితులకు ప్లాట్ల పంపకాల విషయంలో ప్రభుత్వ ఆఫీస్లో జరగాల్సిన రిజిస్ట్రేషన్లు తన ఇంట్లో చేసి, ప్లాట్ల నంబర్లు తన ఇష్టానుసారం చేసి, తనకు అనుకూలంగా లేని వర్గానికి అన్యాయం చేశారని పోస్టర్లలో పేర్కొన్నారు.
కాగా, ఇటీవల మున్సిపల్ ఎన్నికల ప్రచారం కోసం ఆర్ అండ్ ఆర్ కాలనీలో ప్రచారానికి బీఆర్ఎస్ (BRS) ముఖ్య నేత, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు వచ్చే ప్రయత్నం చేస్తే ప్రజలు నిరసన తెలిపి, రాకుండా అడ్డుకోవడం తెలిసిందే.
Read Also: ఐసీయూ నుంచి ఆసియా ఛాంపియన్షిప్కు.. పాక్ ప్లేయర్ స్టోరీ..
Follow Us On: Sharechat


