కలం/ఖమ్మం బ్యూరో: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti) సోమవారం కొత్తగూడెంలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘కత్తి ఎవరి చేతికో ఇచ్చి నన్ను యుద్ధం చేయమంటే ఎలా… కత్తి నా చేతికి ఇచ్చి యుద్ధం చేయమంటే చేస్తా’ అంటూ పొంగులేటి వ్యాఖ్యానించారు. మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను మాత్రమే గెలిపించాలని పొంగులేటి పరోక్షంగా ప్రజలకు సూచించారు. సోమవారం కొత్తగూడెం కార్పొరేషన్ (Kothagudem Corporation) పరిధిలో మంత్రి విస్తృత ప్రచారం నిర్వహించారు.
ఇండ్ల స్థలాల సమస్యలను పరిష్కరిస్తాం
కొత్తగూడెం – సింగరేణి ప్రాంతంలో ఇండ్ల స్ధలాలకు సంబంధించి జివో 76ను పరిష్కరించి ప్రజలకు మేలు చేస్తామని పునరుద్ఘాటించారు. ఇప్పటికే ఇండ్ల స్ధలాల సమస్యపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూపాలపల్లి (Bhupalpally) సభలో స్పష్టమైన హామీ ఇచ్చారని, కార్మిక పక్షపాతిగా నిలిచిన తమ ప్రభుత్వం వారికి న్యాయం చేస్తుందన్నారు. ఎమ్మెల్యే నుంచి ఎంపీ, మంత్రి, ముఖ్యమంత్రి వరకు అందరూ కాంగ్రెస్ ప్రతినిధులేనని, ఈ పురపాలిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్దులను గెలిపించి అభివృద్ది ఫలాలను అందుకోవాలన్నారు. అలాగే ఈ ప్రాంత అభివృద్ది కోసం కాంగ్రెస్, మిత్రపక్ష అభ్యర్దులను గెలిపించాలన్నారు. కొత్తగూడెం పరిధిలోని 60 డివిజన్లలో 58 చోట్ల కాంగ్రెస్ 2 చోట్ల సిపిఎం అభ్యర్థులు పోటీ చేస్తున్నారని వీరందరినీ గెలిపించాలని మంత్రి పొంగులేటి కోరారు.
పెండింగ్ సమస్యలను పరిష్కరిస్తాం
కొత్తగూడెం ప్రాంతంలోని రోడ్లు, డ్రైనేజీ, వంతెనల నిర్మాణం వంటి సమస్యలతో పాటు ఎంతో కాలంగా ఇక్కడి ప్రజలను వేధిస్తున్న మంచి నీటి సమస్య తీరి 24 గంటలూ మంచినీటి సరఫరా కావాలన్నా కాంగ్రెస్ అభ్యర్ధులను గెలిపించాలని కోరారు. ఇవేగాక యువతకు ఉపాధి కల్పనా కార్యక్రమాలు, ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించే బాధ్యత తీసుకుంటానని ప్రకటించారు. 11వ తేదీన పోలింగ్ జరుగునున్నందున ఈ రెండు రోజులు కార్యకర్తలు మరింత కష్టపడాలని, ఇంటింటికి తిరిగి ప్రచారం చేయాలని సూచించారు. కొత్తగూడెం నా సొంత గడ్డ- కాంగ్రెస్ అడ్డా అని చెబుతూ రంగుల రంగుల కండువాలు కప్పుకొని శీనన్న మాకు తెలుసు అంటూ వచ్చే వారిని నమ్మవద్దని మంత్రి పొంగులేటి తెలిపారు.ఏప్రిల్ నుంచి మరో విడత ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని, అర్హులైన పేదలకు ఇంటిస్ధలంతో పాటు ఇల్లు మంజూరు చేస్తామని పొంగులేటి (Ponguleti ) తెలిపారు.
Read Also: చైనాలో భారత్ అథ్లెట్ విజృంభణ.. గోల్డ్ సాధించిన తేజస్విన్
Follow Us On: Sharechat


