కలం, వెబ్ డెస్క్: 2027 పుష్కరాల కంటే ముందుగా పోలవరం ప్రాజెక్టు (Polavaram Project)ను పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. సోమవారం సచివాలయంలో అధికారులు, మంత్రులతో జరిగిన సమావేశంలో సీఎం ఈ విషయాన్ని వెల్లడించారు. వైసీపీ హయాంలో ప్రాజెక్ట్ డయా ఫ్రమ్ వాల్ పూర్తిగా పోయిందన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఎన్ని ఇబ్బందులు ఎదురవుతాయన్న దానికి ఇదొక ఉదాహరణ అని చెప్పారు. రూ.440 కోట్లతో డయాఫ్రమ్ వాల్ పూర్తి చేస్తే దాన్ని కాపాడలేక మొత్తం డ్యామేజ్ చేశారన్నారు. మళ్లీ కొత్తగా నిధులు కేటాయించి నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ నెలలో కానీ, వచ్చే నెలలో కానీ అది పూర్తవుతుందన్నారు.
రాజధాని అమరావతిపై (Amaravati) గత ప్రభుత్వ నాయకులు ఎన్నో విధాలుగా దుష్ప్రచారం చేశారని చంద్రబాబు అన్నారు. ఇది స్మశానం అని, ఎడారి అని ప్రచారం చేశారని ఆరోపించారు. రాజధాని కోసం భూమి ఇచ్చిన రైతులను హింసించారని తెలిపారు. మూడేళ్లలో అమరావతికి మంచి రూపం తీసుకొస్తామన్నారు. రాజధాని పనులు ముమ్మరంగా జరుగుతున్నయని చెప్పారు. మోస్ట్ లివబుల్ సిటీగా అమరావతి రూపు దిద్దుకుంటుందన్నారు. ఇటీవల నీతి అయోగ్లో, బడ్జెట్ సమావేశాల్లో ఇప్పుడు అమరావతిలాంటి నగరం ఎంతో అవసరం ఉందని ప్రశంసలు దక్కినట్లు తెలిపారు. ఇలాంటి అద్భుతమైన నగరం ప్రపంచంలో మరెక్కడా నిర్మించే అవకాశం లేదన్నారు. అత్యాధునిక మౌలిక వసతులతో అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.
Read Also: శ్రీశైలంలో శివస్వాముల ఆందోళన
Follow Us On : WhatsApp


