కలం, వెబ్ డెస్క్ : చైనాలో జరిగిన ఏషియన్ ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్(Asian Indoor Athletics Championship) లో భారత్కు స్వర్ణం లభించింది. తేజస్విన్ శంకర్ (Tejaswin Shankar) భారత్కు ఏకైక స్వర్ణ పతకాన్ని అందించాడు. చివరి రోజున పురుషుల హెప్టాథ్లాన్లో 5993 పాయింట్లు సాధించి విజేతగా నిలిచాడు. ఈ ప్రదర్శనతో తేజస్విన్ తన స్వంత జాతీయ రికార్డును కూడా మెరుగుపరుచుకున్నాడు. తొలి రోజు నుంచే ఆధిక్యంలో ఉన్న తేజస్విన్.. 60 మీటర్ల హర్డిల్స్, పోల్వాల్ట్, 1000 మీటర్ల పంద్యాల్లో నిలకడగా ప్రదర్శించి స్వర్ణాన్ని ఖాయం చేశాడు.
ఈ పోటీల్లో భారత్ మొత్తం ఐదు పతకాలు సాధించింది. ఒక స్వర్ణం, రెండు రజతాలు, రెండు కాంస్యాలతో పతకాల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. చైనా 34 పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది. ఇతర భారత అథ్లెట్లలో పూజ (Pooja) మహిళల హైజంప్లో రజతం గెలుచుకుంది. తజిందర్పాల్ సింగ్ తూర్ (Tajinderpal Singh Toor) షాట్పుట్లో రజత పతకం సాధించాడు. లాంగ్ జంప్లో ఆంసీ సోజన్(Ansi Sojan) కాంస్యంతో మెరిసింది. తొలి రోజున ఆదర్శ్ రామ్ జ్యోతి శంకర్ కాంస్య పతకం అందించాడు. మొత్తంగా భారత అథ్లెట్ల ప్రదర్శన పోటీతత్వంగా సాగింది. ఈ టోర్నమెంట్లో సాధించిన ఫలితాలు భవిష్యత్ అంతర్జాతీయ పోటీలకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తున్నాయి.


