కలం, వెబ్డెస్క్: అఫ్ఘానిస్థాన్తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో న్యూజిలాండ్ విజయం సాధించింది. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 లో (T20 World Cup) భాగంగా చెన్నై వేదికగా ఆదివారం ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో కివీస్ ఐదు వికెట్ల తేడాతో అఫ్ఘానిస్థాన్ను ఓడించింది. 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్కు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. రెండో ఓవర్లోనే ముజీబ్ ఉర్ రెహ్మాన్ వరుస బంతుల్లో ఫిన్ అలెన్, రచిన్ రవీంద్ర వికెట్లు పడగొట్టాడు. దీంతో కివీస్ 14 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి ఒత్తిడిలోకి వెళ్లింది.
ఆ సమయంలో టిమ్ సైఫర్ట్, గ్లెన్ ఫిలిప్స్ కలసి ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. మూడో వికెట్కు 74 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి మ్యాచ్పై పట్టు సాధించారు. ఫిలిప్స్ 42 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే సైఫర్ట్ అదే జోరును కొనసాగించాడు. మార్క్ చాపమన్తో కలసి మరో కీలక భాగస్వామ్యం నిర్మించిన సైఫర్ట్, 42 బంతుల్లో 65 పరుగులు చేసి జట్టును విజయానికి దగ్గరగా తీసుకొచ్చాక అవుట్ అయ్యాడు. చాప్మన్ 28 పరుగులు చేశాడు. చివర్లో డారిల్ మిచెల్, కెప్టెన్ మిచెల్ సాంట్నర్ ఒత్తిడిని తట్టుకుని మ్యాచ్ను ముగించారు. 13 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించారు (T20 World Cup).
అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన అఫ్ఘానిస్థాన్ 20 ఓవర్లలో 182 పరుగులు చేసింది. గుల్బదిన్ నైబ్ అర్ధశతకం(63; 35 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లు) జట్టును ఆదుకున్నాడు. ప్రారంభంలో లాకీ ఫెర్గూసన్ ఒకే ఓవర్లో ఓపెనర్లను ఔట్ చేసి న్యూజిలాండ్కు ఊపునిచ్చాడు. అయితే, ఆ తర్వాత అఫ్ఘానిస్థాన్ కోలుకుంది. మంచి టార్గెట్నే ప్రత్యర్థి ముందు ఉంచింది. ఛేదనలో కివీస్ తడబడినప్పటికీ కీలక సమయాల్లో మెరుగైన భాగస్వామ్యాలు విజయం అందించాయి. అఫ్ఘానిస్థాన్ పోరాడినా ఫలితం మాత్రం కివీస్ వైపే వెళ్లింది.
Read Also: యూఎస్ఏతో గేమ్.. ‘ఒత్తిడి ఎంతుందో నాకే తెలుసు’
Follow Us On : WhatsApp


