కలం, వెబ్ డెస్క్ : మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీంతో జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) కీలక వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయంగా అస్థిరత నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో భారత్, మలేషియా మధ్య పెరుగుతున్న స్నేహం రెండు దేశాలకు అత్యంత ఆవశ్యకమని ఆయన పేర్కొన్నారు. తమ భేటీలో ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై అర్థవంతమైన చర్చలు జరిగినట్లు వెల్లడించారు.
నేటి ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను సమర్థవంతంగా పరిష్కరించాలంటే అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఉభయ దేశాలు బలంగా విశ్వసిస్తున్నాయని ప్రధాని మోదీ (Narendra Modi) తెలిపారు. శాంతి స్థాపనకు జరిగే అన్ని ప్రయత్నాలకు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని ఆయన ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. ముఖ్యంగా ఉగ్రవాదం విషయంలో తమ సందేశం చాలా స్పష్టంగా ఉందని, ఈ విషయంలో ఎటువంటి ద్వంద్వ ప్రమాణాలకు తావులేదని, రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన పేర్కొన్నారు.
మలేషియాలో కాన్సులేట్ ఏర్పాటు..
రెండు దేశాల మధ్య పెరుగుతున్న ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు మలేషియాలో కొత్త కాన్సులేట్ను ఏర్పాటు చేయనున్నట్లు మోదీ వెల్లడించారు. ఇరు దేశాల యువత మధ్య విశ్వవిద్యాలయ మార్పిడి కార్యక్రమాలు, స్టార్టప్ కనెక్ట్, నైపుణ్యాభివృద్ధి రంగాలలో అవకాశాలను మెరుగుపరుస్తున్నట్లు ప్రధాని పేర్కొన్నారు. ఆసియాన్ కూటమితో కలిసి ఈ ప్రాంతంలో అభివృద్ధి, శాంతి, స్థిరత్వానికి భారత్ కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. ఆసియాన్-ఇండియా వస్తువుల వాణిజ్య ఒప్పందం (AITIGA) సమీక్షను వీలైనంత త్వరగా పూర్తి చేయాలనే అంశంపై ఇరు దేశాలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు ఆయన వెల్లడించారు.
Read Also: ఆ ప్రచారం అబద్ధం.. దలైలామా కార్యాలయం
Follow Us On: Sharechat


