కలం, వెబ్డెస్క్: అమెరికాతో కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందం (India US Trade Deal)పై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ శనివారం మీడియా ముఖంగా వివరణ ఇచ్చారు. ప్రతిపక్షాలు ఆరోపించినట్లు ఈ ట్రేడ్ డీల్తో రైతులకు, చేనేతలకు, హస్తకళలకు, ఎంఎస్ఎంఈలకు ఎలాంటి నష్టం లేదని స్పష్టం చేశారు. ఈ ఒప్పందం ద్వారా అమెరికాలో భారత ఉత్పత్తులకు 30 ట్రిలియన్ డాలర్ల మేర మార్కెట్ ఏర్పడుతుందని వివరించారు. అందువల్ల, ఇది భారత ఆర్థికాభివృద్ధిని మరింత వేగవంతం చేస్తుందన్నారు.
కాగా, దాదాపు నాలుగు నెలల అనంతరం భారత్, అమెరికా మధ్య ట్రేడ్ డీల్ కుదిరిన సంగతి తెలిసిందే. ఇండియాపై విధించిన 25శాతం టారిఫ్ను 18శాతానికి తగ్గించినట్లు స్వయంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. తాము పెట్టిన కండిషన్లకు భారత్ అంగీకరించిందన్నారు. ఇందులో భాగంగా తమ ఉత్పత్తులపై జీరో టారిఫ్కు ఇండియా సమ్మతించిందని చెప్పారు. దీంతో ఈ ఒప్పందం భారత రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తుందని ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేశాయి. ట్రేడ్ డీల్పై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని పార్లమెంట్ను స్తంభింప చేశాయి. ఈ క్రమంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ (Piyush Goyal) అమెరికాతో ఒప్పందం గురించి పూర్తిగా వివరణ ఇచ్చారు.
ఇందులో ముఖ్యమైనవి..
- పాలు, చక్కెర, తృణధాన్యాలపై అమెరికాకు భారత్ దిగుమతి సుంకంలో ఎలాంటి రాయితీ ఇవ్వలేదు.
మన దేశం నుంచి ఎగుమతి అయ్యే కొన్ని రకాల పండ్లు, కూరగాయలు, టీ, కాఫీ, మసాలాలు, కొబ్బరి నూనెపై అమెరికాలో టారిఫ్ ఉండదు. జన్యుమార్పిడి (GM) ఉత్పత్తులకు భారత్లోకి అనుమతి లేదు. - భారత ‘ఆత్మనిర్భర్’లో భాగమైన మేకిన్ ఇండియా ఉత్పత్తులకు ఒప్పందం నుంచి మినహాయింపు ఉంది. భారతీయ వ్యవసాయ ఉత్పత్తుల్లో ఎక్కువ వాటికి అమెరికాలో సుంకం ఉండదు. పట్టు ఉత్పత్తులు కూడా అమెరికాలో జీరో టారిఫ్ పరిధిలోకి వచ్చాయి.
- అరటి, మామిడి, జామ, ఆవకాడో, కివీ, బొప్పాయి, అనాస, పుట్టగొడుగులు, ధాన్యాలు, యవలు (బార్లీ), బేకరీ ఉత్పత్తులు, కోకో ఉత్పత్తులు, నువ్వులు వంటి విస్తృత శ్రేణి పండ్లు, కూరగాయలు, వ్యవసాయ ఉత్పత్తులకు కూడా అమెరికా మార్కెట్లో సుంకం లేదు.
- ఈ వాణిజ్య ఒప్పందం రైతులు; సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (MSMEs), హస్తకళలు, చేనేత పరిశ్రమల ప్రయోజనాలకు ఎలాంటి నష్టం కలిగించదు.
- ఎర్ర జొన్నలు, బాదం, జీడిపప్పు, పిస్తా వంటి ట్రీ నట్స్, వైన్లు, మద్యం వంటి కొన్ని ఎంపిక చేసిన అమెరికా ఉత్పత్తులకు మాత్రమే భారత మార్కెట్ను పరిమితంగా తెరిచారు.
- అమెరికా నుంచి దిగుమతి అయ్యే గోధుమలు, మొక్కజొన్న, బియ్యం, సిరిధాన్యాలు, రాగి వంటి ప్రధాన ఆహార ధాన్యాలపై సుంకంలో ఎలాంటి రాయితీలు లేవు. కాబూలీ చనాకు కూడా ఇది వర్తిస్తుంది. మాంసం, పాలు, పాల ఉత్పత్తులు, సోయాబీన్, చక్కెర, ధాన్యాలపై కూడా రాయితీలు లేవు.
- సుమారు 13 బిలియన్ డాలర్ల విలువైన ఔషధ ఎగుమతులకు కూడా అమెరికాలో జీరో టారిఫ్ వర్తిస్తుంది. రత్నాలు, వజ్రాల ఎగుమతులకు కూడా ఇదే ప్రయోజనం ఉంది.
- కొన్ని రకాల వైన్లు, మద్యం వంటి అమెరికా ఉత్పత్తులకు భారత్లో సుంకం ఉండదు. అమెరికా నుంచి దిగుమతి అయ్యే ఆపిల్లకు కోటా ఆధారిత సుంకం రాయితీ ఉంది. అయితే, కనీస దిగుమతి ధర కిలోకు రూ.80గా నిర్ణయించారు. సోయాబీన్ నూనెకు కూడా కోటా ఆధారిత సుంకం రాయితీ ఉంటుంది.
- ఆటోమొబైల్, విమాన భాగాల వంటి కొన్ని రంగాల్లో భారత ఉత్పత్తులు అమెరికాలో జీరో టారిఫ్ కింద ప్రవేశిస్తాయి.
- కొన్ని కంప్యూటర్ సంబంధిత దిగుమతి ఉత్పత్తులపై టారిఫ్స్లో తగ్గింపు ఉంటుంది.ఎన్విడియా (NVIDIA) చిప్స్, కృత్రిమ మేధస్సు (AI) పరికరాలు, డేటా సెంటర్ భాగాలు వంటి కీలక ఐసీటీ ఉత్పత్తులు అమెరికా నుంచి భారత్కు రానున్నాయి. ఇవి ఆధునిక సాంకేతిక రంగాల్లో భారత్ గ్లోబల్గా పోటీపడేందుకు తోడ్పడతాయని పీయూష్ గోయల్ తెలిపారు.
- అమెరికా మార్కెట్లో చైనా ఉత్పత్తులకు 35శాతం, వియత్నాం, బంగ్లాదేశ్(20శాతం), ఇండోనేషియా(19శాతం) సుంకాలు అమలులో ఉన్నాయి. ట్రేడ్ డీల్ (India US Trade Deal) ద్వారా వాటికంటే ఇండియాపై తక్కువ(18శాతం) టారిఫ్ ఉండడం వల్ల మన ఉత్పత్తులకు అమెరికాలో గిరాకీ ఉంటుందని ఆయన అన్నారు.
Read Also: నేడు మలేషియాకు మోడీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు
Follow Us On: Pinterest


