కలం, వెబ్ డెస్క్ : రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో బ్యాక్ డోర్ పద్ధతిలో బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేసేందుకు సర్కారు ప్రయత్నిస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha) తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నెల 9, 10 తేదీల్లో మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్, విద్యుత్ వంటి కీలక శాఖల్లో పెద్ద ఎత్తున నియామకాలు (Recruitment) చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని ఆమె పేర్కొన్నారు. ఈ అక్రమ నియామకాల వ్యవహారంపై ఆమె సోషల్ మీడియా వేదికగా మాట్లాడారు.
జిల్లా స్థాయిలో దొడ్డిదారిన జరుగుతున్న ఈ అక్రమ నియామకాల వల్ల లక్షలాది మంది అర్హులైన నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని కవిత (Kavitha) ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కో ఉద్యోగానికి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారని వస్తున్న వార్తలపై ఆమె మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇంటింటికీ తిరిగి కష్టపడి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన యువతను, నిరుద్యోగులను ఈ ప్రభుత్వం దారుణంగా వంచిస్తోందని విమర్శించారు. కష్టపడి చదువుకున్న వారి నోట్లో మట్టి కొడుతూ, కేవలం పైసలు ఉన్నవారికే ఉద్యోగాలు కట్టబెట్టేలా ప్రభుత్వ తీరు ఉందని ఆమె ఆరోపించారు.
Read Also: ముస్లిం మహిళలకు భరోసా కల్పించిన బీజేపీ : బండి సంజయ్
Follow Us On: Sharechat


