కలం, వెబ్ డెస్క్: బతికి ఉన్న కూతురికి ఓ తండ్రి అంత్యక్రియలు చేశాడు. చుట్టాలను పిలిచి భోజనాలు కూడా పెట్టాడు. చిత్తూరు(Chittoor) జిల్లాలోని పిళ్లారికుప్పంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కూతురు ప్రేమ వివాహం (Love Marriage) చేసుకోవడమే ఆ తండ్రి ఇంతటి పని చేయడానికి కారణమైంది. తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని బతికుండగానే కూతురికి కర్మక్రియలు చేసేశారు. పిళ్లారికుప్పం గ్రామానికి చెందిన హేమప్రియ అదే గ్రామానికి చెందిన కిశోర్ కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయంలో ఇంట్లో తెలియడంతో వద్దని వారించారు. కానీ, హేమప్రియ కిశోర్నే పెళ్లి చేసుకుంటానని తేల్చి చెప్పింది. ఇంట్లో వీరి పెళ్లికి అంగీకరించకపోవడంతో ఇటీవల ఇద్దరూ గుడిలో ప్రేమ వివాహం చేసుకున్నారు. కూతురి పెళ్లితో తల్లిదండ్రులు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. తమ కుమార్తె మృతి చెందిందంటూ ఆమె చిత్రపటానికి నివాళులు అర్పించారు. కర్మక్రియలు నిర్వహించి చుట్టాలకు భోజనాలు పెట్టారు.


