కలం, వెబ్ డెస్క్: తిరుపతి (Tirupati)లో సంచలనం సృష్టించిన విద్యార్థి సంఘం నేతల కిడ్నాప్ కేసులో మోహన్ బాబు యూనివర్సిటీకి చెందిన 13 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 3న విద్యార్థి నేతలు వినోద్ కుమార్, అక్బర్లను కిడ్నాప్ చేసిన ఘటనలో విద్యానికేతన్ పీఆర్వో సతీష్తో పాటు మరో 12 మంది సిబ్బందిని, బౌన్సర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మూడు ఇన్నోవా కార్లు, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, యాజమాన్యం అండతోనే బౌన్సర్లు ఇలాంటి అకృత్యాలకు పాల్పడినట్లు గుర్తించారు.
మరోవైపు ఈ ఘటనకు సంబంధించి కొత్త మలుపు చోటుచేసుకుంది. పీఆర్వో (PRO) సతీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విద్యార్థి నేతలపై కూడా కేసు నమోదు చేశారు. సదరు నేతలు యూనివర్సిటీ యాజమాన్యాన్ని డబ్బులు డిమాండ్ చేశారా లేదా అనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. కిడ్నాప్ వ్యవహారం వెనుక ఉన్న అసలు కారణాల కోసం ఇరు వర్గాల వాదనలను పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు.


