కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రికి చెందిన బినామీ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయల పనులు కట్టబెట్టిందని ఆరోపించారు. బుధవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. దివాలా తీసిన కేఎల్ఎస్ఆర్ (KLSR) అనే కంపెనీకి కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 6 వేల కోట్ల పనులు ఎలా కట్టబెట్టిందని ప్రశ్నించారు. ఈ కంపెనీ కనీసం సిబ్బందికి వేతనాలు కూడా ఇచ్చే పరిస్థితులో లేదని పేర్కొన్నారు. సిబ్బందికి వేతనాలు ఇచ్చేందుకు బ్యాంకు నుంచి రుణం తీసుకున్నదన్నారు. ఈ కంపెనీలో అనేక అవకతవకలు జరిగాయని సుప్రీంకోర్టు కూడా గుర్తించిందని చెప్పారు.
ముఖ్యమంత్రి వాడుతున్న కారు ఆ కంపెనీదే..
కేఎల్ఎస్ఆర్ కంపెనీ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) బీనామీ కంపెనీ అంటూ కేటీఆర్ (KTR) అనుమానం వ్యక్తం చేశారు. ఈ కంపెనీ మీద గతంలో ఐటీ దాడులు కూడా జరిగాయన్నారు. ఈ కంపెనీ అవకతవకలపై ఇటీవల సుప్రీంకోర్టు విచారణ జరిపిందని.. వెంటనే విచారణ జరపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించిందని గుర్తు చేశారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) వెంటనే జోక్యం చేసుకొని సీబీఐ విచారణ జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్ రెడ్డిని కిషన్ రెడ్డి కాపాడుతున్నారని భావించాల్సి వస్తుందన్నారు. మేం అన్ని ఆధారాలతోనే మాట్లాడుతున్నామని చెప్పారు. కేఎల్ఎస్ఆర్ కంపెనీ ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో పనులు చేస్తోందని.. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పనులు చేస్తున్నదని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వెంటనే ఈ కంపెనీలో జరుగుతున్న అవకతవకలపై సీబీఐతో (CBI) విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
Read Also: స్పీకర్కు ఆధారాలు కనిపించడం లేదా?: జగదీష్ రెడ్డి
Follow Us On: X(Twitter)


