కలం, వెబ్ డెస్క్ : వరల్డ్ కప్కు ముందే ఇంగ్లండ్ (England) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. పల్లెకెలే (Pallekele) వేదికగా జరిగిన చివరి టీ20లో శ్రీలంక (Sri Lanka) పై 12 పరుగుల తేడాతో గెలిచి, సిరీస్ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఈ విజయంతో టీ20ల్లో తన సత్తాను చాటుకుంది. ఈ సిరీస్ను వరల్డ్ కప్ ముందు పరీక్షగా భావించిన ఇంగ్లండ్ తన అసలైన బలాన్ని బయటపెట్టింది. మ్యాచ్ చివరి దశకు వచ్చేసరికి ఉత్కంఠ పెరిగింది. 18వ ఓవర్ ప్రారంభంలో శ్రీలంకకు 18 బంతుల్లో 21 పరుగులు అవసరమయ్యాయి. నాలుగు వికెట్లు ఇంకా మిగిలి ఉన్నాయి. అక్కడే జాకబ్ బెతెల్ (Jacob Bethell) రంగంలోకి దిగాడు.
పార్ట్టైమ్ స్పిన్నర్ అయినా ఒక్క ఓవర్తో మ్యాచ్ను పూర్తిగా మార్చేశాడు. ఆ ఓవర్లో మూడు వికెట్లు పడగొట్టి శ్రీలంక ఆశలను చల్లార్చాడు. చివరకు ఆ జట్టు 116 పరుగులకే ఆలౌట్ అయింది. బెతెల్ 11 పరుగులకే నాలుగు వికెట్లు తీసి కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 128 పరుగులకు తొమ్మిది వికెట్లు కోల్పోయింది. పిచ్ స్పిన్కు అనుకూలంగా ఉండటంతో ఈ స్కోరు సరిపోదేమో అనిపించింది. కానీ బౌలింగ్లో ఇంగ్లండ్ పూర్తి ఆత్మవిశ్వాసంతో ఆడింది. పేసర్లకు నాలుగు ఓవర్లు మాత్రమే ఇచ్చారు. మిగతా ఓవర్లన్నీ స్పిన్నర్లతోనే పూర్తి చేశారు. విల్ జాక్స్ మూడు వికెట్లు తీశాడు. ఆదిల్ రషీద్ ఒక వికెట్ సాధించాడు. లియామ్ డాసన్ మరో వికెట్ జోడించాడు. శ్రీలంక బ్యాటర్లు క్రమంగా ఒత్తిడిలోకి వెళ్లారు. మ్యాచ్ అనంతరం ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ (Harry Brook), కఠిన పరిస్థితుల్లో జట్టు తగినట్లు ఆడగలిగిందని అభిప్రాయం వ్యక్తం చేశారు.


