కలం, వెబ్ డెస్క్: ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) నేడు మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) ఇంటికి రానున్నారు. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ఇటీవల అంబటి ఇంటిపై టీడీపీ(TDP) కార్యకర్తలు దాడి చేసిన సంగతి తెలిసిందే. అనంతరం అంబటిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాాండ్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో అంబటి కుటుంబాన్ని పరామర్శించేందుకు నేడు వైఎస్ జగన్ గుంటూరు(Guntur)కు రానున్నారు. ఉదయం 11 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి రోడ్డు మార్గం ద్వారా గుంటూరులోని అంబటి నివాసానికి వెళ్లనున్నారు. జగన్ రాక నేపథ్యంలో అంబటి ఇంటికి వైసీపీ శ్రేణులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. మరోవైపు పోలీసులు గుంటూరులో పోలీసు 30 యాక్ట్ అమలులో ఉందని ప్రకటించారు. జిల్లాలో అనుమతి లేకుండా సభలు, ర్యాలీలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. పోలీసు ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో గుంటూరులో వైఎస్ జగన్ పర్యటన ఎలాంటి ఉద్రిక్తతలకు దారితీస్తుందోనని ఉత్కంఠ నెలకొంది.


