కలం, వెబ్ డెస్క్ : రాజమండ్రి(Rajahmundry) సమీపంలోని తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో పెద్దపులి సంచరించడం స్థానికంగా కలకలం రేపింది. గత రాత్రి సుమారు 9 గంటల సమయంలో పెద్దపులి తిరుగుతూ ఉండగా సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న ఎస్వీపీసీ (SVPC) ఫంక్షన్ హాల్ వద్దకు వచ్చిన పెద్దపులి, అక్కడి నుంచి పక్కనే ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వైపు వెళ్లినట్లు సీసీ ఫుటేజ్లో స్పష్టంగా కనిపిస్తుంది.
ఈ ఘటనతో పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు అప్రమత్తమై, పెద్దపులి కదలికలపై నిఘా పెంచారు. ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, అవసరం లేకుండా బయటకు రాకూడదని అధికారులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ (Bathula Balaramakrishna) స్పందిస్తూ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అటవీ శాఖ అధికారులకు పూర్తిగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పెద్దపులి ఆచూకీపై అధికారులు నిరంతరం పరిశీలన కొనసాగిస్తున్నట్లు తెలిపారు.


