కలం, నిజామాబాద్ బ్యూరో : విధి నిర్వహణలో భాగంగా తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో గంజాయి స్మగ్లర్ల దాడిలో తీవ్రంగా గాయపడి మృతి చెందిన నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ కానిస్టేబుల్ (constable Soumya) గాజుల సౌమ్య (24) అంత్యక్రియలను ప్రభుత్వం అధికార లాంఛనాలతో ఆదివారం నిర్వహించారు. హైదరాబాద్లో చికిత్స పొందుతూ మృతి చెందిన సౌమ్య పార్థివదేహం ఆమె స్వస్థలమైన నిజామాబాద్ జిల్లా మోస్రా మండల కేంద్రానికి చేరుకుంది.
రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారులు పి. సుదర్శన్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్ రావు, కలెక్టర్ ఇలా త్రిపాఠి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ ఖురేషి, డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి, సూపరింటెండెంట్ మల్లారెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ తదితరులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
సౌమ్య (constable Soumya) మృతదేహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు భరోసా కల్పించారు. సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం రూ.కోటి ఎక్స్గ్రేషియా అందించడంతో పాటు, కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తుందని ప్రకటించారు. అదేవిధంగా ఆమె కుటుంబానికి పూర్తి జీతభత్యాలతో కూడిన పెన్షన్ అందిస్తామన్నారు. భవిష్యత్తులో ఈ తరహా సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతుందని, ఎక్సైజ్ సిబ్బందికి కూడా ఆయుధాలు కేటాయించే అంశాన్ని పరిశీలిస్తోందని మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు.


