కలం, డెస్క్ : మాజీ మంత్రి అంబటి రాంబాబు రిమాండ్ రిపోర్టులో పోలీసులు (AP Police) కీలక విషయాలు వెల్లడించారు. అంబటి రాంబాబు బయట ఉంటే కులాలు, పార్టీల మధ్య గొడవలు జరుగుతున్నాయని చెప్పారు. రాంబాబు బయట ఉంటే ఆయన ప్రాణానికి హాని ఉందని.. కాబట్టి రిమాండ్ లో ఉండటమే బెటర్ అంటూ తెలిపారు పోలీసులు. అంబటి రాంబాబు మీద 16 కేసులు ఉన్నాయని.. ఏపీలో శాంతిభద్రతలు అదుపులోకి రావాలంటే రాంబాబు (Ambati Rambabu) రిమాండ్ లో ఉండాలని తెలిపారు పోలీసులు. సీఎం చంద్రబాబును అసభ్యపదజాలంతో రాంబాబు దూషించారని.. వైసీపీ, టీడీపీ మధ్య గొడవలు సృష్టించేలా రాంబాబు మాట్లాడుతున్నారంటూ పోలీసులు వెల్లడించారు. అంబటి వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందన్నారు ఏపీ పోలీసులు (AP Police). అంబటి రాంబాబుకు 14 రోజుల పాటు రిమాండ్ విధించడమే కాకుండా పోలీస్ కస్టడీకి అప్పగించాలని నల్లపాడు పోలీసులు రిమాండ్ రిపోర్టులో తెలిపారు. జిల్లా మెజిస్ట్రేట్ కోర్టు ముందు విచారణ సందర్భంగా పోలీసులు రిమాండ్ రిపోర్టు సమర్పించారు.
పోలీసులు వేధించారు : అంబటి
విచారణ సందర్భంగా కోర్టు ముందు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు తనను వేధిస్తున్నారని తెలిపారు. నల్లపాడు సీఐ తనను ఇబ్బందిపెట్టారంటూ వాపోయారు అంబటి. తన రెండు కాళ్లు వెడల్పు చేసి నిలబెట్టారని.. నొప్పి పుడుతుందని చెప్పినా వినిపించుకోలేదన్నారు రాంబాబు. పై నుంచి ఒత్తిడి ఉంది కాబట్టే అలా చేస్తున్నట్టు పోలీసులు తనతో చెప్పారని అంబటి వెల్లడించారు. అప్పటి వరకు జరిగిన వాటిపై ఫిర్యాదు ఇస్తానన్నా తీసుకోలేదని రాంబాబు వివరించారు.


