కలం, వెబ్డెస్క్: మహిళల ప్రీమియర్ లీగ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఫైనల్కు దూసుకెళ్లింది (RCB – UP Warriorz). గురువారం వడోదరలోని బీసీఏ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో యూపీ వారియర్స్ జట్టుపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా తుదిపోరుకు చేరిన మొదటి జట్టుగా నిలిచింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన యూపీ 20ఓవర్లలో 8 వికెట్లకు 143 పరుగులు చేసింది. ఓపెనర్గా వచ్చిన దీప్తి శర్మ(55; 43 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ చేసింది. మిగిలినవాళ్లలో కెప్టెన్ మెగ్ లానింగ్(41; 30 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) మినహా ఎవరూ సరిగా ఆడలేదు. ఆర్సీబీ బౌలర్లలో నదిన్ డి క్లెర్క్ 4 వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బకొట్టింది. గ్రేస్ హారిస్ 2 వికెట్లు, శ్రేయాంక పాటిల్, లారెన్ బెల్ చెరో వికెట్ తీశారు.
అనంతరం 144 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ ఆరంభం నుంచే ధాటిగా ఆడింది (RCB – UP Warriorz). ఓపెనర్ గ్రేస్ హ్యారిస్ (75; 37 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్లు) ఎడాపెడా ఫోర్లు, సిక్స్లతో చెలరేగింది. మరో ఓపెనర్, కెప్టెన్ స్మృతి మంధాన (54 నాటౌట్: 27 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లు) సైతం వేగంగా ఆడింది. చివరి వరకూ నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చింది. జార్జియా వోల్ (16; 15 బంతుల్లో 2 ఫోర్లు) ఓ మోస్తరు పరుగులు చేసింది. శిఖా పాండే, ఆశా శోభన చెరో వికెట్ తీశారు. ఈ ఓటమితో ప్లేఆఫ్ అవకాశాలను యూపీ సంక్లిష్టం చేసుకుంది.


