కలం, వెబ్డెస్క్: విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ (Ajit Pawar) బుధవారం మరణించిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనపై వస్తున్న ఊహాగానాలకు, అనుమానాలకు ఎన్సీపీ అధినేత, అజిత్ పవార్ బాబాయ్ శరద్ పవార్ (Sharad Pawar) చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే బారామతిలోని అహిల్యాబాయి హాస్పిటల్కు కుటుంబంతో కలసి చేరుకున్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘అజిత్ మరణం రాష్ట్రానికి తీరని లోటు. అతని స్థానాన్ని వేరెవరూ భర్తీ చేయలేరు. ఈ దుర్ఘటన ప్రమాదమే. రాజకీయంతో సహా వేరే కోణమేదీ లేదు’ అని అన్నారు.
అంతకుముందు అజిత్ పవార్ మరణంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతోపాటు మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్, గౌరవ్ గొగోయ్ సహా అనేక మంది అనుమానాలు వ్యక్తం చేశారు. ‘బీజేపీ పాలనలో రాజకీయ నాయకులకు ముఖ్యంగా ప్రతిపక్ష నేతలకు భద్రత లేకుండా పోతోంది. ఈరోజు జరిగిన సంఘటన పలు అనుమానాలకు తావిస్తోంది. మన నమ్మకం కేవలం సుప్రీంకోర్టు మీద మాత్రమే. మిగిలిన ఏ సంస్థనూ నమ్మలేం’ అంటూ అజిత్ మరణంపై మమత వ్యాఖ్యానించారు. ‘ఈ ప్రమాదంపై పూర్తి పారదర్శకంగా విచారణ జరగాలి. ఎందుకంటే అచ్చం ఇలాంటి సంఘటనే, మూడేళ్ల కిందట ఇదే ఏవియేషన్ సంస్థకు చెందిన విమానం విషయంలో జరిగినట్లు నా దగ్గర సమాచారం ఉంది’ అని దిగ్విజయ్ అన్నారు.
కాగా, బాబాయ్ సారథ్యంలోని ఎన్సీపీ నుంచి తన వర్గం ఎమ్మెల్యేలతో కలసి 2023లో అజిత్ పవార్ వేరుపడిన సంగతి తెలిసిందే. అజిత్ వైపు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉండడంతో పార్టీ పేరు, గుర్తు కూడా అజిత్కే దక్కాయి. అనంతరం బీజేపీ సారథ్యంలోని మహాయుతిలో చేరి, డిప్యూటీ సీఎం అయ్యారు. అయితే, ఇటీవల మహారాష్ట్ర పురపాలిక ఎన్నికలకు ముందు తిరిగి బాబాయ్ శరద్ పవాద్ (Sharad Pawar) తో అజిత్ కలిశారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం బారామతి వద్ద జరిగిన విమాన ప్రమాదంలో అజిత్ మరణించడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, వాటన్నిటికీ చెక్ పెట్టేలా శరద్ పవార్ తేల్చేయడంతో ప్రస్తుతం ఎన్సీపీ అభిమానులు కాస్త శాంతించారు. మరోవైపు ప్రమాదంపై డీజీసీఏ, ఏఏఐబీ దర్యాప్తు కొనసాగుతోంది.
Read Also: అజిత్ పవార్ ఫ్లైట్ క్రాష్ : కీలక విషయాలు వెల్లడించిన DGCA
Follow Us On : WhatsApp


