కలం, వెబ్డెస్క్: విదేశాల్లో తరచూ జరిగే మనీహీస్ట్ను తలపించేలా దేశంలో అతిపెద్ద దోపిడీ జరిగింది. రూ.400కోట్ల డబ్బు ఉన్న కంటైనర్ (Cash Container Heist) ను అపహరించారు. కర్ణాటక–గోవా సరిహద్దులో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై మహారాష్ట్రలోని నాసిక్లో (Nashik) కేసు నమోదు కాగా, ఇప్పటివరకు ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసును ప్రత్యేక బృందం దర్యాప్తు చేస్తోంది. సంచలనం కలిగిస్తున్న ఈ దోపిడీ వివరాలు..
సయ్యద్ అజార్, విరాట్ గాంధీ, మచ్చీంద్ర మాధవి అనే ముగ్గురు వ్యక్తులు తమ వద్ద రూ.400కోట్ల విలువైన 2వేల రూపాయల నోట్లు ఉన్నాయని, వాటిని తీసుకొని తమకు కొంత డబ్బువ్వాలని ఓ బిల్డర్ను సంప్రదించారు. ఆ నోట్లను అప్పటికే భారత ప్రభుత్వం మార్కెట్ నుంచి విరమించుకోవడంతో వీటిని ఎలాగైనా మార్చుకోవాలని వాళ్లు అనుకున్నారు. అదంత సులువు కాకపోవడంతో, ఇలాంటి వ్యవహారాల్లో పేరున్న బిల్డర్ను కలిశారు.
వాళ్ల ప్రతిపాదనకు అంగీకరించిన ఆ బిల్డర్ కొంత డబ్బును వాళ్లకు ముందుగానే ఇచ్చాడు. అయితే, ఆ తర్వాత డబ్బు ఉన్న కంటైనర్ను సందీప్ పాటిల్ (35) అనే వ్యక్తి అపహరించినట్లు బిల్డర్కు వాళ్లు చెప్పారు. దీంతో బిల్డర్ పంపిన మనుషులు సందీప్ను కిడ్నాప్ చేశారు. కంటైనర్ తమకు అప్పగించాలని చిత్రహింసలు పెట్టి, వదిలేశారు. అనంతరం సందీప్ నేరుగా నాసిక్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు అజార్, విరాట్, మాధవి తోపాటు సందీప్ దాడికి పాల్పడిన మరో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.
రాజకీయ వివాదం..
రూ.400కోట్ల కంటైనర్ దోపిడీ (Cash Container Heist) వ్యవహారం రాజకీయ వివాదం తీసుకుంది. ఈ కంటైనర్ మహారాష్ట్ర నుంచి గోవా, కర్ణాటక మీదుగా ఆంధ్రప్రదేశ్లోని తిరుపతికి చేరాల్సి ఉంది. అయితే, మార్గమధ్యంలో గోవా–కర్ణాటక సరిహద్దులోని చర్లకొండ రూట్లో బెలగావికి వస్తుండగా అపహరణకు గురైంది. ఇది గతేడాది అక్టోబర్ 22న జరగ్గా, సందీప్ పాటిల్ ఫిర్యాదుతో ఇటీవల బయటపడింది.
కాగా, దోపిడీ ఘటనలో కర్ణాటక కాంగ్రెస్, బీజేపీ పరస్పరం ఆరోపణలకు దిగాయి. కొన్ని రాష్ట్రాల్లో త్వరలో జరగబోయే ఎన్నికల కోసం కాంగ్రెస్ ఈ డబ్బు తరలిస్తోందని బీజేపీ ఆరోపించింది. దీని వెనక కాంగ్రెస్ అధినేత మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే ఉన్నారంది. ఈ ఆరోపణలను ప్రియాంక్ ఖర్గేతోపాటు కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర, మంత్రి జార్కి హోలీ ఖండించారు. కేసు నాసిక్లో నమోదైందని, మహారాష్ట్ర సిట్ దర్యాప్తు జరుపుతోందంటూ.. మహారాష్ట్ర, గోవాలో ఏ పార్టీ అధికారంలో ఉందో తెలుసుకోవాలన్నారు. అంతేకాదు, ఈ కంటైనర్ తిరుపతికి వెళుతోందంటున్నారు కాబట్టి అక్కడ ఏ పార్టీ అధికారంలో ఉందో కూడా చూడాలన్నారు. కేసును తమకు అప్పగిస్తే దర్యాప్తు చేసి అసలు దోషులను బయటపెడతామంటూ సవాల్ విసురుతున్నారు. కాగా, రూ.400కోట్ల కంటైనర్ దోపిడీ వ్యవహారంలో తిరుపతి పేరు వినిపించడంపై తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చ నడుస్తోంది.
Read Also: పెంగ్విన్ ఓపికకు నెటిజన్లు ఫిదా.. వీడియో వైరల్
Follow Us On : WhatsApp


