కలం, వెబ్డెస్క్: ప్రముఖ జర్నలిస్ట్, రచయిత, బీబీసీ ‘వాయిస్ ఆఫ్ ఇండియా’గా పేరు పొందిన మార్క్ టుల్లీ(90) కన్నుమూశారు (Mark Tully). వృద్ధాప్య సమస్యలతో వారం కిందట ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారు. ప్రముఖ వార్తా సంస్థ బీబీసీలో దాదాపు 30 ఏళ్లు పనిచేసిన ఆయన అనేక రచనలు సైతం చేశారు. భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలు పొందారు.
మత ప్రబోధకునిగా మారాలనుకొని..
పశ్చిమ బెంగాల్లోని టోలీగాంగ్లో 1935లో బ్రిటిష్ దంపతులకు జన్మించిన మార్క్ టుల్లీ (Mark Tully) కి భారతదేశమంటే అమితమైన ప్రేమ, అభిమానం. కోల్కతాలో ప్రాథమిక విద్య అనంతరం మత ప్రబోధకుడిగా మారాలనుకొని యూకేలోని లింకన్ థియోలాజికల్ కాలేజీలో చేరారు. అయితే, ఇండియాకు తిరిగి వచ్చాక 1964లో బీబీసీ న్యూఢిల్లీ కరస్పాండెంట్గా జర్నలిజం ప్రస్థానం ప్రారంభించారు.
బీబీసీ రేడియోలో ‘సమ్థింగ్ అండర్స్టుడ్’ కార్యక్రమం యాంకర్గా ఆయనకు ఎంతో పేరు తెచ్చింది. అలాగే, భారత్పై రూపొందించిన అనేక డాక్యుమెంటరీల్లో భాగమయ్యారు. 1969లో వివాదాస్పద ‘ఫాంటమ్ ఇండియా’ డాక్యుమెంటరీ ప్రసారం విషయంలో భారత ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేయడంతో యూకేకు వెళ్లిపోయారు. తిరిగి 1971లో ఇండియాకు వచ్చారు. అనంతరం బీబీసీలో సౌత్ ఏషియా విభాగానికి చీఫ్ బ్యూరోగా పనిచేశారు.
భారత్లో జరిగిన అనేక విప్లవాత్మక, సంచలనాత్మక సంఘటనలను రిపోర్ట్ చేశారు. బంగ్లాదేశ్ విముక్తి పోరాటం, ఎమర్జెన్సీ, పాకిస్థాన్ మాజీ ప్రధాని జుల్ఫీకర్ భుట్టోకు ఉరి, సిక్కు అలర్లు, రాజీవ్ గాంధీ హత్య, బాబ్రీ మసీదు విధ్వంసం, భోపాల్ గ్యాస్ ట్రాజెడీ వంటి వాటిని రిపోర్ట్ చేశారు.
పది పుస్తకాలు రాశారు. ఇందులో ‘నో పుల్ స్టాప్స్ ఇన్ ఇండియా’, ‘ఇండియా ఇన్ స్లో మోషన్’, ‘ది హార్ట్ ఆఫ్ ఇండియా’ ముఖ్యమైనవి.
Read Also: పుస్తక నేస్తం అంకెగౌడ.. అక్షర యోగికి అందిన పద్మం
Follow Us On: Instagram


